Chandrababu Naidu Should Think about Nara Lokesh

కేంద్రంలో పదేళ్ళపాటు యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఓ వెలుగు వెలిగారు. అప్పుడు ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని ఒత్తిడి చేసేవారు. పార్టీ నేతలు కూడా ఒత్తిడి చేస్తుండేవారు.

ఆయనకు ఆ వెసులుబాటు కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి వీర విధేయుడైన డా. మన్మోహన్ సింగ్‌ని ఆ కుర్చీలో కూర్చోపెట్టారని అందరికీ తెలిసిందే.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

కానీ ఆ గొప్ప అవకాశాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోయారు. గుర్తించి సిద్దపడేసరికి ఆ కుర్చీలో నరేంద్ర మోడీ సెటిల్ అయిపోయారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ భవన్‌లో తలక్రిందులుగా తపస్సు చేసినా ఎన్నటికీ ఆ కుర్చీలో కూర్చోలేరు. ఎందువల్ల అంటే మిత్రపక్షాల మద్దతు లేకుండా కాంగ్రెస్‌ ఎన్నటికీ అధికారంలోకి రాలేదు కనుక. మిత్రపక్షాలలో ఓ అరడజను మంది ప్రధాని రేసులో ఉన్నారు గనుక!

Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే

ఇంచుమించు ఇదేవిదంగా తెలంగాణలో కేసీఆర్‌ కూడా తన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాలనుకున్నారు.

మొదటి 5 సంవత్సరాలు బంగారు తెలంగాణ పేరుతో తమ రాజకీయ ప్రత్యర్ధులను ఏరివేయాలి కనుక కేటీఆర్‌కి కుర్చీ అప్పజెప్పలేదు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు వాస్తుదోషాలు లేకుండా రాజమహల్ వంటి సచివాలయం కట్టించి, అందులో సింహాల బొమ్మలతో సిఎం ఛాంబర్ ఏర్పాటు చేశారు. పార్టీలో అందరిచేత ‘కేసీఆర్‌ దేశ్ కీ నేత’, ‘కేటీఆర్‌ కాబోయే ముఖ్యమంత్రి’ అనిపించేశారు కూడా. కనుక తాను ఢిల్లీకి బయలుదేరే ముందుకు యువరాజావారిని గృహాప్రవేశం చేయించి ఆ కుర్చీలో కూర్చోపెట్టాలని అనుకున్నారు.

కానీ ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడమే కాక లిక్కర్ స్కామ్ కేసులో కూతురు కల్వకుంట్ల కవిత చిక్కుకుంది. ఓ పక్క రేవంత్ రెడ్డి, మరోపక్క బండి సంజయ్‌ ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీకి ఎసరు పెట్టేసేందుకు సిద్దమయ్యారు. ఆ భయంతోనే కేటీఆర్‌కి యువరాజ పట్టాభిషేకం జరగలేదు. మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే వెంటనే చేసేవారేమో కానీ రాలేదు. చేయలేదు. మళ్ళీ రాగలరో లేదో చేయగలరో లేదో తెలీదు.

ఏపీలో చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్‌ అని అందరికీ తెలుసు. “టీడీపీలో మూడో తరం నాయకుడైన నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని” నేడు మైదుకూరు ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.

టీడీపీ ఒక్కటే అధికారంలో ఉండి ఉంటే ఎవరూ విజ్ఞప్తి చేయకపోయినా నారా లోకేష్‌కి తప్పక ఈ ప్రమోషన్ లభించి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపి కూడా ఉన్నాయి.

కనుక ఉప ముఖ్యమంత్రి పదవికి సముచిత గౌరవం, ప్రాధాన్యం, అధికారాలు ఉండాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఒక్కరికే ఆ పదవి కట్టబెట్టారు. ఆయన కోరుకున్నట్లుగానే ఎన్నడూ లేనివిదంగా ఉప ముఖ్యమంత్రి పదవికి సముచిత గౌరవం, ప్రాధాన్యం, అధికారాలు లభిస్తున్నాయి కూడా. కనుక శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు ఇప్పట్లో అమలుచేయకపోవచ్చు.




కానీ రాహుల్ గాంధీ, కేటీఆర్‌ల పరిస్థితి చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు వయసు, పార్టీలో సీనియర్స్ అభిప్రాయాలు, వారి ఆలోచనలు, సలహాలు, సూచనలు, 2029 నాటికి నెలకొనే రాజకీయ పరిణామాలు, సమీకరణాలు అన్నిటినీ లెక్క చూసుకొని చంద్రబాబు నాయుడు తగిన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరమే!