
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా అడపాదడపా ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్ తగలబడుతూనే ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నా కేసులు కొలిక్కిరావడం లేదు. తాజాగా ఈనెల 5 రాత్రి తాడేపల్లి ప్యాలస్ బయట మంటలు చెలరేగాయి.
జగన్కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా లభించనప్పటికీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రభుత్వం, కూటమి పార్టీలు, ప్రజలు, మీడియా అందరూ కూడా జగన్నే ప్రతిపక్షనాయకుడుగా భావిస్తున్నారు. కనుక అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఆయన ఇంటి బయట అగ్నిప్రమాదాన్ని ప్రభుత్వం కూడా తేలికగా కొట్టి పడేయలేదు.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్ని బ్రిటన్ గుర్తించింది!
కనుక పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఎవరైనా అకతాయిలు నిప్పు పెట్టారా లేదా వైసీపీ కార్యాలయ సిబ్బందే ఏవైనా కాగితాలు, ఫైల్స్ తగులబెట్టడానికి మంటలు అంటించారా? అనే కోణాలలో విచారణ జరుపుతున్నారు.
తాడేపల్లి ప్యాలస్లోని వైసీపీ కార్యాలయ నిర్వాహకులకు పోలీసులు నోటీస్ ఇచ్చారు. ప్యాలస్ బయట మంటలు అంటుకున్నప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన రోజు రాత్రే ఈ అగ్నిప్రమాదం జరగడంతో, దానికి సంబందించిన ఆధారాలు దొరక్కుండా వైసీపీ కార్యాలయ సిబ్బందే డైరీలు, ఫైల్స్ తగులబెట్టి ఉండవచ్చని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ కాకుంటే మంటలు అంటుకుని వ్యాపిస్తున్నప్పుడు వెంటనే అగ్నిమాపకశాఖకి ఫోన్ చేసి ఎందుకు పిలిపించలేదు?మంటలు వ్యాపించకుండా ఆర్పేందుకు వైసీపీ కార్యాలయ సిబ్బందే ఎందుకు ప్రయత్నించారు?అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read – డీలిమిటేషన్: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!
సాధారణంగా టీడీపీ నేతలు జగన్ని చిన్న మాట అంటే వైసీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తుంటారు. కానీ మద్యం కుంభకోణం కేసుకి సంబందించిన డైరీలు, ఫైల్స్ తగులబెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామంటూ, భారీగా ఆదాయం లభించే మద్యం వ్యాపారాన్ని వైసీపీ నేతలకు అప్పగించేశారు. ఇదే అదునుగా నాసిరకం మద్యం మార్కెట్లోకి దించేసి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్నారు.
జగన్ కనుసన్నలలోనే రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు అంతా జరుగుతుండేవి. కనుక ఏరోజుకారోజు నగదు రూపంలో కమీషన్ తాడేపల్లి ప్యాలస్కు వచ్చేదని, ఆ డబ్బునే ఎన్నికలలో విరజిమ్మి 175 కి 175 సీట్లు గెలుచుకోవచ్చని జగన్ భావించేవారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండేవారు.
ఇప్పుడు సిట్ విచారణలో అవన్నీ బయటపడితే ప్రమాదం కనుక ఆధారాలు మాయం చేసేందుకు డైరీలు, ఫైల్స్ తగులబెట్టి ఉంటారని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలీసులకు చేతికి ఎటువంటి ఆధారాలు చిక్కకూడదని జగన్ అనుకుంటే, వాటిని తగులబెడుతున్నప్పుడు రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ మాత్రం భద్రంగా జాగ్రత్తపరిచి పోలీసులకు అందిస్తారని ఎలా అనుకోగలమూ?