
వైసీపీ అధినేత జగన్ మళ్ళీ తాను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని, ఆ తర్వాత మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని నిన్ననే జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారమధంతో ఉంటారు కనుక అప్పుడు అలా మాట్లాడినా అర్దం చేసుకోవచ్చు.
కానీ 175 వస్తాయనుకుంటే 11 సీట్లతో ఘోర పరాజయం పాలైన తాడేపల్లి ప్యాలస్ నుంచి అడుగు బయట పెట్టడానికి భయపడుతున్నప్పుడు కూడా జగన్ 2.0 అని జోస్యం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?
దేశంలో ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ నాయకుడు ఇలాగే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని, ఉండాలని పగటి కలలు కాంటారు. కానీ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్కరూ కనబడరు. ఎందువల్ల అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యపడదు కనుక!
కానీ ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ఈవిదంగా ఎందుకు మాట్లాడుతున్నారు?అంటే పార్టీ నేతలు పక్కచూపులు చూడకుండా ఉంచేందుకు, పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకునేందుకే మభ్య పెడుతున్నారు.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్ని బ్రిటన్ గుర్తించింది!
జగన్ నిజంగానే తన పార్టీని కాపాడుకోవాలనుకుంటే ముందుగా తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రావాలి. శాసనసభ సమావేశాలకు హాజరయ్యి బయట మాట్లాడుతున్న మాటలు లోపల కూడా ధైర్యంగా చెప్పాలి. తర్వాత ప్రజల మద్యకు, పార్టీ శ్రేణుల మద్యకు వెళ్ళి ప్రతీ ఒక్కరితో మమేకం కావాలి. గతంలో జగన్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు. అధికారంలోకి వచ్చారు కదా?
కనుక పార్టీ నేతలను తాడేపల్లి ప్యాలస్కి పిలిపించుకునే రాచరికపు పోకడలు మానుకొని, ప్రజాస్వామ్య పద్దతిలో శాసనసభకు, ప్రజల వద్దకు వెళ్ళాలి. అప్పుడే 2.0 గురించి మాట్లాడేందుకు జగన్కి నైతిక హక్కు ఉంటుంది.
జగన్ 1.0 షాక్ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు ఇంకా తేరుకోలేదని, ఆ చేదు అనుభవాల తర్వాత ఇక ఎవరూ జగన్ 2.0 కోరుకోరని మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట అక్షరాల నిజం.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
కానీ జగన్ తన పార్టీ నేతలను మభ్యపెట్టేందుకే 2.0 వెర్షన్ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఆయన మాటలు ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తే ‘ఎందుకు రిస్క్?’ అని వారు వెనక్కు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక జగన్ 2.0 ఉండబోదని వారికి నమ్మకం కలిగించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందుకు ఏమి చేయాలో అందరికంటే ఆయనకే బాగా తెలుసు.
కానీ “అమరావతి, పోలవరం పూర్తి చేసి చూపిస్తా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా.. వాటిని చూసి ప్రజలే గెలిపిస్తారనే” భ్రమలో ఉంటే 2019 సీన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
అదే జరిగితే ఈసారి 2.0 ఆషామాషీగా ఉండబోదని, టీడీపీకి చాలా ప్రమాదకరంగా ఉంటుందని జగన్ హెచ్చరిస్తూనే ఉన్నారు. కనుక జగన్ 2.0ని టీడీపీ లైట్ తీసుకోవడానికి లేదు.