kesineni-sivanath-kesineni-nani-chandrababu-naidu

టీడీపీని వీడిన మాజీ ఎంపీ కేశినేని నాని సిఎం చంద్రబాబు నాయుడుకి ఓ విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం ఓ పోస్ట్ పెట్టారు. ఆయన తమ్ముడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్న) కంపెనీకి భూకేటాయింపుల గురించి ఆయన పలు విషయాలు పేర్కొని దీనిపై పునరాలోచన చేయాల్సిందిగా సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.

Also Read – ‘బతుకమ్మ’ ఆడిన మిస్ వరల్డ్ బ్యూటీస్…!

కేశినేని నాని ఏమన్నారంటే, “మీరు విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీకి భూములు కేటాయించినందుకు అభినందిస్తున్నాను. మీరు ఈవిదంగా ఐటి కంపెనీలను ప్రోత్సహించడం వలన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

కానీ దీంతో పాటు కొత్తగా ప్రారంభించిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా 60 ఎకరాలు కేటాయించడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిలో 3.5 ఎకరాలు విశాఖ ఐటి పార్కులో, మరో 56.36 ఎకరాలు భీమిలి సమీపంలో కాపులుప్పాడ వద్ద కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. సదరు కంపెనీ రూ.5,728 కోట్లు పెట్టుబడితో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

Also Read – బాయ్‌కాట్ టర్కీ.. మరి చైనా సంగతి?

కానీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ మరికొందరు వ్యక్తులు కలిసి ఈ భూటకపు కంపెనీని సృష్టించి పెద్ద కుంభకోణం చేయబోతున్నట్లు భావిస్తున్నాను.

గతంలో అబ్బూరి సతీష్ తదితరులు ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ప్రోపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నాక బోర్డు తిప్పేశారు.

Also Read – మోడీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు గానీ…

ఈ కంపెనీలో డైరెక్టర్‌గా చెప్పబడుతున్న అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని శివనాధ్ కలిసి చదువుకున్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. కనుక సతీష్ ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ వెనుక ఎంపీ కేశినేని శివనాధ్ ఉన్నారని నమ్ముతున్నాను.

ఓ ఎంపీగా కేశినేని శివనాధ్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఈ భూకేటాయింపులు జరిపించుకున్నారని భావిస్తున్నాను.

గతంలో వీరు ఇసుక, ఫ్లై యాష్, మట్టి తవ్వకాలు, జూద గృహాలు, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అక్రమాలకు పాల్పడిన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకుగాను వీరు మంత్రి నారా లోకేష్‌ పేరు కూడా ఉపయోగించుకున్నట్లు, ఆయన కోసమే ఇవన్నీ చేస్తున్నట్లు చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు విశాఖలో అత్యంత విలువైన ఈ భూములను సొంత చేసుకునేందుకే డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి కేటాయింపజేసుకున్నారని భావిస్తున్నాను.

భూకేటాయింపులకు కొద్ది రోజుల ముందుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. దానికి డేటా సెంటర్ ఏర్పాటులో ఎటువంటి పూర్వ అనుభవమూ లేదు.

కనుక ఇటువంటి వారికి విలువైన భూమి కేటాయించడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చాలా నిజాయితీగా, పారదర్శకంగా పని చేస్తున్న మీకు, మీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.

కనుక ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూకేటాయింపులు తక్షణం రద్దు చేసి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాను,” అని మాజీ ఎంపీ కేశినేని నాని సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం ఓ పోస్టు పెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ కేశినేని శివనాధ్ ఇంకా స్పందించాల్సి ఉంది.