Pakistan Simla pact threat

జమ్ము కశ్మీర్‌ ఉగ్రదాడితో భారత్‌-పాకిస్థాన్‌ మద్య ఉద్రిక్తతలు మళ్ళీ పతాక స్థాయికి చేరాయి. భారత్‌ నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహించే సింధూ నది జలాలపై ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని భారత్‌ ప్రకటించగానే సీమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాక్‌ ప్రకటించింది.

Also Read – బీజేపి కోసం టీడీపీ త్యాగాలు అవసరమా?

సింధూ ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ నీళ్ళని ఎక్కడికీ మళ్ళించుకు పోలేదు. అది సాధ్యం కాదు కూడా!

ఈ విషయం పాక్‌కి కూడా తెలుసు కనుక కాస్త సంయమనంతో స్పందించి ఉంటే బాగుండేది. కానీ భారత్‌ని కవ్విస్తున్నట్లు పాక్‌ వ్యవహరిస్తోంది.

Also Read – బాయ్‌కాట్ టర్కీ.. మరి చైనా సంగతి?

1972యుద్ధంలో పాక్ ఓడిపోయినప్పటికీ ఆ దేశం పట్ల అనుచితంగా వ్యవహరించకుండా సీమ్లా ఒప్పందంపై భారత్‌ సంతకం చేసింది. ఒకవేళ చేయకూడదనుకుంటే పాక్ ఏమీ చేయగలిగేది కాదు!

ఆ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల సైనికులు, పౌరులు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితులలో ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ దాటి పొరుగు దేశంలో జొరబడకూడదు.

Also Read – అమెరికాపై దాడులు జరిగితే ట్రంప్‌ ఇలాగే స్పందించేవారా?

సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు తప్ప నేటికీ భారత్‌ దానికి కట్టుబడే ఉంది. కానీ సర్జికల్ స్ట్రైక్ జరుగలేదని పాక్ వాదిస్తోంది కనుక అప్పుడు కూడా భారత్‌ హద్దు దాటలేదని పాకిస్థాన్‌ స్వయంగా ధృవీకరించినట్లే కదా?

కానీ పాక్ ప్రేరిత ఉగ్రవాదులు నేటికీ దానిని దాటి జమ్ము కశ్మీర్‌లో ప్రవేశిస్తూనే ఉన్నారు. వారికి పాక్ సైన్యాధికారులు, పాలకులు అవసరమైన శిక్షణ, ఆయుధాలు, సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ భారత్‌ సంయమనం కోల్పోకుండా జమ్ము కశ్మీర్‌లో ప్రవేశించిన ఉగ్రవాదుల తో పోరాటాలు చేస్తూ అనేక సైనికులను బలి చేసుకుంటూనే ఉంది. మూడు రోజుల క్రితం జమ్ము కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి ఇందుకు తాజా నిదర్శనం.

దీనిని యావత్ ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పుడు పాక్ ఆచితూచి స్పందించాలి. కానీ సీమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

అంటే ఇంతకాలం దొంగచాటుగా యుద్ధం చేస్తున్నాము.. ఇకపై సరిహద్దు దాటివచ్చి భారత్‌తో ముఖాముఖి యుద్ధానికి సిద్దం అని పాక్ ప్రకటించినట్లే.

పాకిస్థాన్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ దేశ ప్రధాని, మంత్రుల కాన్వాయ్ ఖర్చులు కూడా భరించలేకపోతోంది. ప్రధాని మోడీ ఒకే ఒక్క హెచ్చరిక చేయగానే పాక్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయి మూసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇటువంటి దయనీయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రగల్భాలు పలుకుతుండటం, యుద్ధానికి కవ్విస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఓ పక్క వాఘా సరిహద్దు వద్ద గేట్లు మూసేసి, వందల కిలో మీటర్ల పొడవైన ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ తెరుస్తామని పాక్ పాలకులు చెపుతుండటంతో ఇటువంటి పాలకుల చేతిలో పాకిస్థాన్‌ దేశం, ప్రజలు ఉన్నారా?అని జాలి కలుగుతుంది.

యుద్ధోన్మాదంతో మాట్లాడుతున్న పాక్ పాలకులకు భారత్‌ ఎలాగూ నచ్చజెప్పలేదు. కనుక అమెరికా లేదా మరో దేశమో పాక్ పాలకులకు, సైన్యాధికారులకు వారి దేశ పరిస్థితిని వివరించి కళ్ళెం వేయక తప్పదు.

సీమ్లా ఒప్పందం అమలులో ఉన్నప్పుడే పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశిస్తుండేవారు. ఇప్పుడది లేకపోతే? కనుక పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం కంటే ముందు భారత్‌లోకి ఎవరూ జొరబడకుండా నిలువరించడమే భారత్‌ తక్షణ కర్తవ్యం.