
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపితో యుద్ధాలు చేస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధాని మోడీతో కేసీఆర్ చాలా సఖ్యతగా ఉండేవారు. తరచూ ఢిల్లీ వెళ్ళి కలుస్తుండేవారు. తద్వారా రాష్ట్రంలో తనపై పోరాడుతున్న తెలంగాణ బీజేపికి విశ్వసనీయత లేకుండా చేశారు.
ఆ తర్వాత హటాత్తుగా ప్రధాని మోడీపై కేసీఆర్ కత్తులు దూయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపి బలపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కానీ బండి సంజయ్ని అడ్డుకునే బదులు, ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నారు కేసీఆర్.
Also Read – ఇదిగో అదంపూర్ వైమానిక స్థావరం.. ఫోటోలు చూసుకోండి: మోడీ
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ప్రయత్నంలో తన స్థాయిని పెంచుకొని జాతీయ నాయకుడుగా ఎదిగేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ కత్తులు దూయడం మొదలుపెట్టారు. తద్వారా తెలంగాణ బీజేపిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టవచ్చని కేసీఆర్ అనుకున్నారు. కానీ కేసీఆర్ ఒకటనుకుంటే జరిగింది మరొకటి!
ఒకవేళ తెలంగాణలో బీజేపి బలహీనంగా ఉండి ఉంటే కేసీఆర్ బహుశః ఇటువంటి ఘోరమైన తప్పిదం చేసి ఉండేవారు కారని చెప్పవచ్చు.
Also Read – ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తే క్రెడిట్ జగన్కి!
తర్వాత జరిగిన స్టోరీలన్నీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి కేసీఆర్తో సహా బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ బీజేపి, ప్రధాని మోడీని విమర్శించడం మానుకున్నారు!
కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని గుంజుకుంది కనుక కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎలాగూ కేంద్రంలో అధికారంలో లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా చేతులు కాళ్ళు కట్టేసినట్లు నిసహాయంగా ఉంది.
Also Read – నైజాం పర్సెంటేజ్ లొల్లి… అసలు టార్గెట్ వేరే!
కనుక కేటీఆర్ తదితరులు కాంగ్రెస్ పార్టీని చాలా ధైర్యంగా విమర్శిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా అనుచితంగా మాట్లాడగలుగుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు బీజేపి కూడా తమ శతృవని గుర్తుకువచ్చింది. కనుక ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపిలపై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. అంటే బీజేపి విషయంలో గులాబీ బాస్ వైఖరి మళ్ళీ మారిందన్న మాట!
రేపు హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభ జరుగబోతోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దానిలో “దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ ప్రభ తగ్గుతున్నది. పహల్గాంను రాజకీయానికి వాడుకోవడం నీచం. మేము స్పిరిచువల్లీ హిందూ.. పొలిటికల్లీ కాదు. ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినం. మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతం,” అని పేర్కొనడమే ప్రధాని మోడీ, బీజేపి పట్ల కేసీఆర్ వైఖరిలో మార్పుకి తాజా ఉదాహరణగా భావించవచ్చు.
తెలంగాణలో తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కేసీఆర్ ప్రధాని మోడీతో చేతులు కలపాలని ప్రయత్నించారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలహీనంగా, అసమర్ధంగా ఉందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, బీజేపిలని బూచిగా చూపిస్తూ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజేసి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవచ్చని కేసీఆర్కి పూర్తి నమ్మకం కలిగినట్లుంది. కనుక ఇక బీజేపి సాయం తమకు అవసరం లేదని భావించడం వల్లనే కేసీఆర్ తన వైఖరి మార్చుకొని ఉండొచ్చు.
అందువల్లే బిఆర్ఎస్ పార్టీ నేతల మాటలు సోషల్ మీడియాలో పోస్టులలో కూడా ఈ మార్పు చాలా స్పష్టం కనిపిస్తోంది.
కానీ కేసీఆర్ వైఖరిలో మార్పు కలిగిన ప్రతీసారి బిఆర్ఎస్ పార్టీయే నష్టపోతోందనే విషయం ఆ పార్టీలో అందరూ మరిచిపోతున్నారు. కనుక ఈసారి కేసీఆర్ వైఖరిలో ఈ మార్పుతో ఏం జరుగబోతోందో?