YS Jagan

జగన్‌-షర్మిల ఆస్తుల పంచాయితీ పార్ట్-1 అందరూ చూశారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా పార్ట్-2 మొదలైంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన విజయసాయి రెడ్డి, మర్నాడే షర్మిల ఇంటికి వెళ్ళి రాజకీయాలు మొదలుపెట్టడంతో ఈ సీక్వెల్‌ మొదలైంది. ఈ సీక్వెల్లో ఆస్తులకు మించి చాలా విషయాలే బయటపడతాయి. కనుక మరింత రసవత్తరంగా ఉంటుంది.

“మా ఆస్తుల పంచాయితీలో నాకు వ్యతిరేకంగా మాట్లాడాలని జగన్‌ తనపై ఒత్తిడి చేసి మాట్లాడించారని, అంత పెద్దాయన నా ఇంటికి వచ్చి చెపుతుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఆస్తుల కోసం ఎంతకైనా తెగించే నా అన్న జగన్‌ విలువలు, విశ్వసనీయత అని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది,” అని షర్మిల మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!

విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి షర్మిలని కలిసి జగన్‌ గురించి చెప్పడం, ఆమె వెంటనే మీడియా ముందుకు వచ్చి ఈవిదంగా మాట్లాడటం చూస్తే ఇద్దరూ కలిసి ఏపీ రాజకీయాలలో కొత్త అధ్యాయం మొదలుపెట్టినట్లనిపిస్తుంది.

వైఎస్ షర్మిల ఒక్కరే ఎదురుదాడి చేస్తే వైసీపీ ఎన్నికలలో నష్టపోయింది. తాడేపల్లి ప్యాలస్‌ రహస్యాలన్నీ తెలిసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆమెతో చేతులు కలిపారు కనుక వైసీపీకి ఇంకా నష్టం కలగవచ్చు.

Also Read – యాదగిరిగుట్టకు ఓ బోర్డు… అవసరమా?

విజయసాయి, షర్మిల తనకు వ్యతిరేకంగా చేతులు కలిపారు కనుక జగన్‌ కూడా తన కాలకేయ సైన్యాన్ని వారిపైకి ఉసిగొల్పడం, వారు విజయసాయి, షర్మిలపై మూకుమ్మడిగా దాడి చేయడం, అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఎదురు దాడి చేయడం ఖాయమే.

ఒకవేళ ఈ యుద్ధం ముదిరి పాకాన్న పడితే, వివేకా హత్యతో సహా తాడేపల్లి ప్యాలస్‌ రహస్యాలన్నిటినీ విజయసాయి రెడ్డి బయటపెడితే ఇంకా ప్రమాదం. వైసీపీకి బలమూ, బలహీనత రెండూ జగనే కనుక ఆయన ప్రతిష్ట ఎంతగా మసకబారితే అంతగా వైసీపీ నష్టపోతుంటుంది.

Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!

విజయసాయి వంటి విధేయుడు జగన్‌ ధోరణి భరించలేక బయటకువెళ్ళి ఆయన ప్రత్యర్ధి షర్మిలతో చేతులు కలిపి పోరాటాలకు సిద్దమైతే, విశ్వసనీయత, అధికారం రెండూ కోల్పోయిన జగన్‌ వెంట పార్టీలో ఎంతమంది ఉంటారు?ఎంత మంది బయటకు వెళ్లిపోతారు?

ఓ పక్క కూటమిని, మరో పక్క వారిరువురినీ, ఒకవేళ కేసులలో కదలిక మొదలైతే వాటిన్నిటినీ జగన్‌ ఒకేసారి ఒంటరిగా ఎదుర్కొంటూ పోరాడగలరా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభించవచ్చు.

ఓ ప్రతిపక్షపార్టీ నేతగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన జగన్‌, ఇప్పుడు సొంత మనుషులతోనే ఎందుకు పోరాడవలసివస్తోందంటే విలువలు, విశ్వసనీయత కోల్పోవడం వల్లనే కదా?

అయినా జగన్‌, విజయసాయి, షర్మిల ముగ్గురూ ఓ తానులొ ముక్కలే. వారు ముగ్గురూ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకోకుండా ఉంటారా?