
ఒకప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు పెద్దగా జరిగేవి కావు కానీ ఇప్పుడు చాలా విరివిగా ‘క్యాంపస్ సెలక్షన్’ అయిపోతున్నాయి కనుక కులరహిత సమాజం కోసం అంటూ ఎవరూ పనిగట్టుకొని పోరాడక్కరలేదు.
అలాగే ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ‘ఇంటర్ కాస్ట్’లు పెరిగాయి. అంటే పెళ్ళిళ్ళు కావు… నటీనటులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో సినిమాలు చేయడం.
ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమని అందరూ చిన్న చూపు చూసేవారు. కానీ కాంతారా, కేజీఎఫ్, సలార్ వంటివి కన్నడ సినీ పరిశ్రమకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఒకప్పుడు మళయాళీ సినిమాలంటే ‘పెద్దలకి మాత్రమే’ అన్నట్లు ఉండేవి. కానీ ఇప్పుడు మలయాళీ సినిమా అంటే క్లాసిక్స్ అనుకునేలా మారాయి. వాటి రీమేక్స్ ‘దృశ్యం’లా తెలుగులోకి వచ్చేస్తున్నాయి. చిరంజీవి అంతటి వాడు కూడా మలయాళ సినిమాకి టెంప్ట్ అయ్యి గాడ్ ఫాదర్ చేసేశారు.
టాలీవుడ్, కోలీవుడ్ ఎప్పుడూ సమ ఉజ్జీలుగానే సాగాయి. రెంటికీ బలమైన బంధమే ఉంది కనుక వేరు చేసి చూడలేము.
దక్షిణాది సినీ పరిశ్రమలు, వాటిలో నటీనటుల సినిమాలు ‘ఇంటర్ కాస్ట్’ అనుకుంటే బాలీవుడ్ కూడా వచ్చి చేరింది. ఉత్తరాది, దక్షిణాది భాష, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆలోచనా విధానం పూర్తిగా ఉంటాయి. కనుక టాలీవుడ్-బాలీవుడ్ ‘మిక్స్’ని ఇంటర్ రిలీజియన్’గా అభివర్ణించవచ్చు.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలు, దర్శకులు, నటీనటులు అంటే బాలీవుడ్కి చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు దక్షిణాది మీద ముఖ్యంగా.. టాలీవుడ్ మీద బాలీవుడ్కి చాలా మోజు పెరిగిపోయింది. బాలీవుడ్ నటీనటులు తెలుగు పాన్ ఇండియా సినిమాలలో కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రభాస్ కల్కి ఇందుకు చిన్న ఉదాహరణ.
ఈ మోజుతోనే సందీప్ వంగా చేత యానిమల్ చేయించుకున్నారు రణబీర్ కపూర్. ఈ మోజుతోనే గోపీచంద్ మలినేనితో ‘జాట్’ చేస్తున్నారు సన్నీ డియోల్.
మరోపక్క జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నిఖిల్, నితిన్ వంటివారు పాన్ ఇండియా మూవీలతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరించి వస్తూనే ఉన్నారు.
ఈ పెను మార్పులకి కారణం అందరికీ తెలిసిందే. రాజమౌళి, ప్రశాంత్ వర్మ, సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటివారు దక్షిణాది సినీ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి చేర్చడమే.
కనుక ఈ ఇంటర్ కాస్ట్, ఈ ఇంటర్ రెలిజియన్ మిక్స్ వలన ఇప్పుడు దేశంలో సినీ పరిశ్రమలన్నీ కలిసి భారతీయ సినిమాగా ఒక్కటిగా ఎదిగి హాలీవుడ్ని ఢీకొనే సమయం వచ్చేసిన్నట్లే ఉంది.
అయితే ఈ పాన్ ఇండియా మూవీ మోజులో పడి అందరూ నెటివిటీని,మాతృ భాషలని, ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను వదిలేసుకుంటారేమో?అనే చిన్న భయం కూడా ఉంది.
ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ఇతర రాష్ట్రాల ప్రజలను మెప్పించాలంటే యూనివర్సల్ కంటెంట్, భాష వగైరా ఉండాలి. దాని కోసం నేటివిటీతో సహా అన్నీ వదులుకోక తప్పదు.
కానీ అక్కరలేదని ‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ చెప్పారు. మహాభారతంతో టెక్నాలజీని ముడిపెట్టి కల్కి ఏడీ 2898లా తీయవచ్చని నాగ్ అశ్విన్ చూపారు. కనుక ఏవిదంగా ముందుకు సాగాలో భారతీయ సినీ పరిశ్రమే నిర్ణయించుకోవల్సి ఉంటుంది.
Dhanush's upcoming film Kara, directed by Vignesh Raja, is gearing up for a worldwide theatrical…
Kolkata Knight Riders got their first win of IPL 2026 after beating Rajasthan Royals by…