
శస్త్ర చికిత్స చేసి కాలో చెయ్యో తీసేస్తారని తెలిసినప్పుడు పడే ఆందోళన అంతా ఇంతా ఉండదు. కానీ కాలో చెయ్యో పోగొట్టుకున్నవారు లోకంలో ధైర్యంగానే బ్రతుకుతుంటారు. ఇదేవిధంగా చనిపోవడం కంటే చనిపోతాననే ఆలోచనే మనిషిని ఎక్కువ భయపెడుతుంది. ఆ భయమే ప్రాణం తీసుకునేలా చేస్తే? బెంగళూరు ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న విద్యాజ్యోతి (29) చావు భయంతో ఆత్మహత్య చేసుకుంది.
తొమ్మిది రోజుల క్రితమే ఆమె ప్రేమించిన యువకుడితో పెళ్ళి జరిగింది. కనుక కంపెనీ అనుమతి తీసుకొని ఇంటి నుంచే ఆఫీసు పని చేసుకుంటోంది. ఆమెకు జాతకాలు, గ్రహఫలాలపై నమ్మకం ఎక్కువ. కనుక తమ వైవాహిక జీవితం ఏ విధంగా సాగుతుందో తెలుసుకునేందుకు ఓ జ్యోతిష్యుడిని సంప్రదించింది. కానీ అతను నువ్వు అతి త్వరలో చనిపోబోతున్నావంటూ చెప్పడంతో హడలి పోయింది. చావు నుంచి తప్పించుకోవడానికి అతను చెప్పినట్లే తొమ్మిది రోజుల పాటు ప్రతీరోజూ ఇంట్లో ప్రత్యేక పూజలు చేసింది. జ్యోతిష్యుడు చెప్పినట్లే అన్ని పూజలు చేసింది. కనుక ఇక చావు నుంచి తప్పించుకున్నానని సంతోషపడాలి కదా. కానీ చివరి రోజైన మొన్న శుక్రవారం పూజలు ముగిసిన తర్వాత జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళసూత్రం తీసి ఇంట్లో అమ్మవారి పటం ముందుంచింది. తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో చావు భయంతోనే ఆమె ఈవిధంగా చేసినట్లు తేలింది. ఆమెని భయపెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు కారకుడైనందుకు సదరు జ్యోతిష్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సమస్యలు లేని జీవితం ఉండదు. సమస్యలు సృష్టించుకుని జీవితాలను నరకం చేసుకునేవారు కూడా ఉంటారు. లేని సమస్యలను ఉన్నట్లు ఊహించుకుని బాధపడేవారు కూడా ఉంటారు. విద్యాజ్యోతి మూడో రకం. ఆమెలాంటి భయాలు, అపోహలు ఉన్నవారు కనీసం కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులు, స్నేహితులతో తమ సమస్యలు పంచుకుంటే పరిస్థితి ఇంత దాకా రాదు. లేని సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…