
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య ఏర్పడిన ప్రతిష్టంభన 10 రోజులుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ సోమవారం సాయంత్రంలోగా ఈ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారమవుతాయని, మళ్ళీ షూటింగ్లు ప్రారంభం అవుతాయని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నమ్మకంగా చెప్పారు.
ఆయనతో సహా కొందరు నిర్మాతలు ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి పరిస్థితిని వివరించారు. సోమవారం సినీ కార్మిక సంఘాల నేతలు కూడా చిరంజీవిని కలిసి తమ సమస్యలు, డిమాండ్స్ గురించి చెప్పనున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత చిరంజీవి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చెపుతారని నిర్మాత కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అయన చెప్పిన కొన్ని విషయాలు ఆలోచింపజేస్తాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు, ఎవరి సమస్యలు వారికున్నాయి. కనుక ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిందే.
సినిమా నిర్మాత మొదలు లైట్ బాయ్ వంటి సినీ కార్మికుడు వరకు అందరం కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటాము. రూల్స్ మాట్లాడితే సినిమాలు తీయలేము. అందుకే ముందు పెట్టుకున్న షరతులు, ఆంక్షలు పక్కన పెట్టి పని చేసుకుపోతుంటాము.
ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా 12 గంటలు పనిచేయడం నిబంధనలకు విరుద్దం కావచ్చు. కానీ సెట్స్లో లైట్ బాయ్ మొదలు నిర్మాత వరకు అందరికీ ప్రతీరోజూ టీలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు నడుస్తూనే ఉంటాయి. ఒకవేళ 8 గంటలే పని అనుకుంటే అవన్నీ మేము ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు కదా?
కానీ సినిమా తీయడం మాకు ముఖ్యం కనుక వాటన్నిటి గురించి మేము పట్టించుకోము. సినీ కార్మికులు కూడా అదే ఆలోచనతో అదనపు పని గంటల గురించి పట్టించుకోకుండా పనిచేస్తుంటారు. ఇది పూర్తిగా పరస్పర అవగాహనతో జరిగేదే తప్ప ఎవరి ఒత్తిడితో కాదు.
నేను కూడా ఓ సాధారణ సినీ కార్మికుడుగా పనిచేసి ఈ స్థాయికి వచ్చాను. కనుక వారి కష్టనష్టాలు, సమస్యలు ఏవిదంగా ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక వాళ్ళు మేము ఇద్దరం నష్టపోకుండా ముందుకు సాగడమే చాలా ముఖ్యమని నేను భావిస్తాను.
ఇప్పటికే చాలా అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. మిగిలిన ఒకటి రెండు అంశాలు కూడా రేపు సాయంత్రంలోగా కొలిక్కి వస్తాయి. మంగళవారం నుంచి తప్పకుండా షూటింగ్స్ మొదలవుతాయని నాకు నమ్మకం ఉంది,” అని సి కళ్యాణ్ అన్నారు.
Sobhita Dhulipala has opened up about why she left home for Mumbai at just 16,…
వైసీపీ హయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి ప్రజలు లోలోన కుమిలిపోతున్న సమయంలోనే కేసీఆర్ హయంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే…