
జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపి ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బయటపెట్టే క్రమంలో రోజుకో కుంభకోణం వివరాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరులో ఇండోసోల్ అనే వైసీపి నేతల బినామీ కంపెనీకి వారి ప్రభుత్వం ఏవిదంగా 8,348 ఎకరాలు అప్పగించేసిందో వివరించారు.
ఆయన పరిశ్రమలశాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టారు కనుక ఆ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చి నాదెండ్ల మనోహర్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే నాదెండ్ల మనోహర్ చేసిన ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పకుండా, నాదెండ్ల కుటుంబంలో పెద్ద కట్టప్ప, చిన్న కట్టప్ప ఉన్నారని నాదెండ్ల భాస్కరరావు ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడవబోతున్నారని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
గుజరాత్ తర్వాత దేశంలో అత్యధిక పెట్టుబడులు, పరిశ్రమలు సాధిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు. రాష్ట్రంలో చిన్న, మద్య తరహా పరిశ్రమలలో సుమారు 13 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాది పొందుతున్నారని మంత్రి గుడివాడ అన్నారు.
2022-23 ఏపీ జిడిపి గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే నంబర్:1 స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి చూసి ఓర్వలేకనే స్కూలు బ్యాగుల కుంభకోణం, భూముల కుంభకోణం అంటూ చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నాదెండ్ల మనోహర్ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేస్తుండటం నిజమైతే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి తనసాటి ఏపీ మంత్రి గుడివాడ దగ్గర చాలా నేర్చుకోవలసి ఉంది.
ఏపీలో ఇంత వృద్ధి రేటు ఉందని తెలియకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు నెల నెలా జీతాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పారిశ్రామికాభివృద్ధి జరిగిందని, ఇన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలియకనే ప్రతీరోజు ఏపీ నుంచి వేలమంది నిరుద్యోగ యువత డిగ్రీలు చేతపట్టుకొని హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వలసలు పోతున్నారు.
కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరికీ తెలియని, కనబడని అభివృద్ధి ఏదో జరిగిపోయిందని గుడివాడ అమర్నాథ్ చెపుతున్నారు కనుక నమ్మవలసిందే! ఏపీ పారిశ్రామికాభివృద్ధి చూసి అందరూ అసూయతో రగిలిపోతున్నారనే మాట కోడి, గుడ్డు, ఆమ్లెట్ కంటే చాలా బాగుంది కదా?
Rajasthan Royals defeated Sunrisers Hyderabad in the Eliminator of IPL 2026 and booked their place…
Suriya has made a divine comeback with the Tamil film Karuppu, which has crossed Rs.…