
ఎవరు అవునన్నా కాదన్నా నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. సరిహద్దు భద్రత పెంచి జమ్ము కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి మళ్ళీ శాంతి భద్రతలు నెలకొల్పారు.
అలాగే దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు ముందుగానే పసిగడుతూ ఉగ్రదాడులను అడ్డుకుంటున్నారు.
ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి గట్టి హెచ్చరికలు చేసినందున మళ్ళీ అటువంటి దుసాహాసం చేయదనే అందరూ భావించారు. కానీ పాక్ ప్రభుత్వానికి తన సైన్యం మీదే నియంత్రణ లేనప్పుడు ఉగ్రవాదుల మీద ఉంటుందని ఎలా ఆశించగలము?
నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు ప్రేలుడులో ఫరీదాబాద్కు చెందిన వైద్యుడు డా. ఒమర్ మహ్మద్, మరికొందరు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వారు కాశ్మీర్లోని పుల్వామాలో ఓ వ్యక్తి దగ్గర నుంచి హ్యుండాయ్ ఐ 20 మోడల్ కారు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వారు ఆ కారులోనే కూర్చొని సాయంత్రం 6.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు కారులో విస్పోటనం జరిగింది. కనుక ఇది పధకం ప్రకారమే జరిగిన ఆత్మాహుతి దాడి కావచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఈ ప్రేలుడుతో కూడా పాకిస్తాన్కు సంబంధం ఉందా లేదా?అనేది దర్యాప్తులో తెలుస్తుంది. ఒకవేళ ఉంటే పాక్ మళ్ళీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ట్రంప్కి మళ్ళీ పనిపడుతుంది. అది వేరే విషయం.
ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లో ఓ వైద్యుడుతో సహా ముగ్గురిని నిఘా సంస్థలు అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ప్రేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే కాశ్మీర్లో కొందరిని అరెస్ట్ చేసి ఆయుధాల డంప్, ప్రేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
వీరందరికీ పాక్తో సంబంధం ఉందా లేదా?అనే విషయం పక్కన బెడితే, దేశంలో ఇంకా ఉగ్రవాదులు లేదా వారి సానుభూతిపరులు ఉన్నారని ఈ అరెస్టులు, ఈ దాడితో స్పష్టమైంది.
బయట నుంచి పాకిస్తాన్ చేసే దాడుల కంటే ఇటువంటి వారి వల్లనే ఎక్కువ ప్రమాదమని నిన్న జరిగిన ప్రేలుడుతో స్పష్టమయ్యింది.
‘ఆపరేషన్ సింధూర్’తో పాకిస్తాన్ని మోకాళ్ళపై కూర్చోబెట్టామని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ ‘ఇంటి దొంగలు’ ఒకే ఒక్క ప్రేలుడుతో 150 కోట్ల ప్రజలను మళ్ళీ ఉలిక్కిపడేలా, భయపడేలా చేశారు కదా?
కనుక దేశ భద్రతకు, ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారిన ఇటువంటి ఉగ్రవాదులను గుర్తించి ఎప్పటికప్పుడు ఏరివేయడం చాలా అవసరం.
అమెరికాలో 2001లో ట్విన్ టవర్స్ ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఉగ్రవాదులు అమెరికావైపు కన్నెత్తి చూడకుండా చేయగలిగింది అమెరికా ప్రభుత్వం. భారత ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని స్పందిస్తుండటం చాలా అవసరం.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…