
నిజమే! వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమే లేకుంటే ఇప్పుడు టిడిపి, జనసేనలను ఎంతగా వేదిస్తున్నారో అంతకు అంతా అనుభవించాల్సి ఉంటుందని గ్రహించినట్లే ఉన్నారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రాగానే సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని, వారికి వత్తాసు పలుకుతూ తమని వేదిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరిపై తప్పక ‘తగు చర్యలు’ తీసుకొంటామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు పదేపదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు మెతకవైఖరి అవలభించాలనుకొన్నా, వైసీపీ ప్రభుత్వం చేతిలో తీవ్ర అవమానాలు, వేధింపులకు గురైన సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, బోండా ఉమా, అనితా వంగలపూడి వంటి సీనియర్ నేతలు ఊరుకోరు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే వారికి అంతులేని కష్టాలు మొదలవడం ఖాయం. కనుక ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాల్సిందే. కానీ ఇటువంటి కారణాలతో ఎన్నికలలో గెలిచి తీరాల్సిన పరిస్థితులు కల్పించుకోవడాన్ని ఏమనుకోవాలి?
ఈసారి వైసీపీ గెలిస్తే మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని సిఎం జగన్ చెప్పడాన్ని తేలికగా తీసుకోలేము. దానర్దం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో టిడిపి, జనసేనలను పూర్తిగా తుడిచిపెట్టేసి రాజకీయంగా వైసీపీకి ఇక ఎదురులేకుండా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చు. ఈ మూడున్నరేళ్ళలో టిడిపి, జనసేనలు ఎదుర్కొన్న వేధింపులను బట్టి చూస్తే అది సాధ్యమే అని అర్దమవుతుంది. కనుక వచ్చే ఎన్నికలలో గెలవడం వైసీపీకి ఎంత ముఖ్యమో టిడిపి, జనసేనలకు కూడా అంతే ముఖ్యమని స్పష్టం అవుతోంది.
అయితే వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ గెలుస్తుందా? గెలిస్తే మరో 30 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించగలదా?అసలు పాలించడానికి రాష్ట్రంలో ఇక ఏమైనా మిగిలి ఉంటుందా?అనే మూడు ప్రశ్నలకు నిజయతీగా సమాధానాలు చెప్పుకోవలసిన అవసరం ఉంది.
వచ్చే ఎన్నికలలో సంక్షేమ పధకాలే వైసీపీని గెలిపిస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇక మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల వారీగా ప్రజలను విడదీసి వారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా టిడిపి, జనసేనలను రాజకీయంగా దెబ్బతీయడం, వచ్చే ఎన్నికలలోగా టిడిపి ముఖ్యనేతలను వారివారి నియోజకవర్గాలలోనే బలహీనపరచడం వంటి ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే వైసీపీ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంటుంది.
అయితే ఈ మూడున్నరేళ్ళలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులతో సహా వివిద వర్గాలకు చెందిన ప్రజలను కూడా వైసీపీ విడిచిపెట్టలేదు. సామాన్య ప్రజానీకం కూడా వైసీపీ వేధింపులకి గురవుతున్నారని చెప్పేందుకు రాజధాని రైతులపై వైసీపీ దాడులు, ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేతలు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. కనుక ఈసారి వారందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయం.
ఇక రాబోయే ఎన్నికలలో టిడిపి, జనసేనలు గెలవలేకపోతే ఆ తర్వాత జరిగే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వాటిని కనిపించకుండా చేసే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నట్లు స్పష్టమయ్యింది కనుక వాటికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యవంటివే. కనుక సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం. అవి అంతగా పోరాడినా వైసీపీకి 175 సీట్లు వచ్చేస్తాయని చెప్పుకొంటే అది ఆత్మవంచనే అవుతుంది.
ఇదివరకు జగన్ పాలన ఏవిదంగా ఉంటుందో ప్రజలు రుచి చూడలేదు కనుక ఆయన తండ్రి వైఎస్సార్ పాలనలాగే ఉంటుందనే ఉద్దేశ్యంతో గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ ఇప్పుడు రుచి చూశారు కనుక రాబోయే ఎన్నికలలో వైసీపీకే ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొని ఉన్నందున వచ్చే ఎన్నికలలో ఎటువంటి ప్రభంజనాలు ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు.
తెలంగాణ తర్వాత టార్గెట్ ఏపీయే అని బిజెపి నేతలే చెపుతున్నారు కనుక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం దానిని 5 ఏళ్ళు పదవీకాలం పూర్తి చేయనీయకపోవచ్చు. చేయనిస్తే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. అయినా ఈ 5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన తర్వాత ఇక రాష్ట్రంలో పాలించడానికి ఇంకా ఏమి మిగిలి ఉంటుంది?వైసీపీ మళ్ళీ గెలిస్తే ఇప్పుడు చేసిన, ఇక ముందు చేయబోయే అప్పులను, వాటికి వడ్డీలు తీర్చుకోవడానికే సరిపోతుంది. కనుక ఏ పార్టీ గెలిచినా అధికారం ముళ్ళ సింహాసనమే అవుతుంది. అందులో కూర్చోవడానికి పోటీ పడతామంటే ఎవరు కాదనగలరు?
The conversation around top stars in Telugu cinema seems to be shifting. For a long…
After being a loyal follower of the YS family for multiple decades, Vijaya Sai Reddy…