
జీవితంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలు, కష్టాలు, అవమానాలు, ఒత్తిళ్ళు, క్షణికావేశంవంటి అనేక అంశాలు మనుషులను ఆత్మహత్యకి ప్రేరేపించవచ్చు.
అదే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని వారికీ తెలుసు కానీ అదే ముగింపు… దాంతోనే విముక్తి అని గట్టిగా నమ్మడం వల్లనే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు.
ఓ మనిషి ఎంత వరకు ఒతిళ్ళు భరించగలరు? అనేది ఆ వ్యక్తి మానసిక పరిణతి, కుటుంబంలో సంబంధాలు ఇంకా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
యువతీయుకులు, పెళ్ళై చాలా కాలం కలిసి జీవిస్తున్నవారు ఇటువంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాము. కానీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ళ బాలిక కూడా ఇటువంటి సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమే. కానీ ఆలోచింపజేస్తుంది.
ఆ వయసులో ఆమెకు ఇంకా మంచీ చెడూ పూర్తిగా తెలియవు. జీవితం, సమాజం, భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన ఏర్పడదు. అలాంటి వయసులో ఆమె ఆత్మహత్య చేసుకోవడం సమాజ ధోరణిలో వస్తున్న మార్పులకి ప్రతీకగా చూడవచ్చు.
ఇక్కడ ఆమె పేరు, వివరాలు చెప్పుకోవడం సబబు కాదు. ఏలూరు జిల్లాకు చెందిన ఆ బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకొందంటే, ఆమె తల్లి రెండు కిడ్నీలు చెడిపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే చూడలేకనే!
వారిది నిరుపేద కుటుంబం. ఆమె తల్లి ‘డయాలసిస్’ చేయించుకుంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లికి కిడ్నీ మార్పిడి చేయించలేని పేదరికం, ఆమె బాధ, ఆర్ధిక సమస్యలు కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ విషాదభరితమైన వాతావరణం నెలకొని ఉండేది.
ఈ పరిస్థితులు ఆ బాలికని మానసికంగా బాగా క్రుంగదీశాయని సూసైడ్ లెటర్ ద్వారా స్పష్టమైంది. కానీ ఈ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగల వయసు, మానసిక పరిణతి ఆమెకు లేదు. కనుక పరిష్కారం లేదని భావించి ఈ వేదన నుంచి బయటపడేందుకు ఆత్మహత్య చేసుకుంది.
కానీ నేటికీ ఆమె తల్లి తీవ్ర అనారోగ్య సమస్యలను భరిస్తూ కుటుంబం కోసం జీవిస్తూనే ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాలికకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అంటే వారు కూడా ఆమె లాగే ఈ సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ అనుభవిస్తూనే ఉన్నారన్న మాట!
కానీ వారు ముగ్గురూ ఇలాంటి ఆలోచన చేయలేదు. ఈ బాలిక ఒక్కర్తే చేసింది. అంటే మానసికంగా బలహీనపడిందన్న మాట! కానీ ఈ విషయాన్ని ఇంట్లోవారు కానీ, పాఠాశాలలో ఉపాధ్యాయులు గానీ గుర్తించలేకపోయారు. గుర్తించి ఉంటే ఇంత చిన్న వయసులో ఇటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా చేసి ఉండేది కాదు కదా?
కానీ మన సమాజంలో ఇటువంటి మానసిక సమస్యలను ‘కష్టాల వలన కలిగే బాధగా’ మాత్రమే చూస్తుంటారు తప్ప ఎవరూ దీనిని మానసిక సమస్యగా గుర్తించరు.
పిల్లల విషయంలోనే కాదు యువతీ యువకులు మొదలు వృద్ధుల వరకు కనిపించే ఈ మానసిక సమస్యలను ఎవరూ పట్టించుకోరు. చివరికి ఆ సమస్యతో బాధపడుతున్నవారు కూడా దానిని సమస్యగా గుర్తించరు. కనుక దానిని సమస్యగా భావించరు. ఈ బాలిక విషయంలో కూడా ఇలాగే జరిగిందని భావించవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాలలో పాఠాశాలలలో మానసిక నిపుణులు తప్పనిసరిగా ఉంటారు. వారు ఇటువంటి మానసిక సమస్యలున్న విద్యార్ధులకు కౌన్సిలింగ్, ఇంకా అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేసి సకాలంలో చికిత్స అందించి సాయపడుతుంటారు.
కానీ మన దేశంలో పాఠాలు భోదించేందుకు ఉపాధ్యాయులను నియమించడానికే ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుంటే ఇక మానసిక నిపుణులను ఏర్పాటు చేయగలవా? లేదు. కనుక ఉపాధ్యాయులే తమ విద్యార్ధులని నిశితంగా గమనిస్తూ వారు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతూ ఉండాలి.
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…