
వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యులు అనాలా లేదా వివాదాస్పద జ్యోతిష్యులు అనాలా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. గత ఏడాది నాగ చైతన్య–శోభితా దూళిపాళ వివాహం చేసుకున్నప్పుడు, వారి కాపురం మూడేళ్లకు మించి సాగదని, ఇద్దరూ విడిపోతారని అన్నారు. ‘శుభమా అని వారు పెళ్లి చేసుకుంటే ఇలా మాట్లాడుతారా?’ అంటూ ఆయనపై చాలా మంది విరుచుకుపడ్డారు.
నిన్న సమంత, రాజ్ నిడిమోరు వివాహం జరగడంతో నేడు మళ్లీ ఆయన నోటికి పని చెప్పారు. అవసరం లేని మాటలు మాట్లాడారు.
తన ఆశ్రమంలో మీడియాతో మాట్లాడుతూ, “సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోగానే మళ్లీ మీడియా ప్రతినిధులు నావంటి జ్యోతిష్యుల నోళ్లలో మైకులు పెట్టి వారి పెళ్లి నిలుస్తుందా లేదా? నిలిస్తే ఆడపిల్ల పుడుతుందా లేక మగ పిల్లాడా? అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు.
వారిని అలా అడగమని సమంత, రాజ్ నిడిమోరు కోరలేదు కదా? కానీ మీడియా వచ్చి అడిగితే వారు తమకు తెలిసిందీ చెబుతుంటారు. ఆ రోజు నేను నాగ చైతన్య–శోభితా దూళిపాళ పెళ్లి చేసుకునప్పుడూ ఇలాగే అడిగారు. నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ తర్వాత అందరూ నన్ను తప్పుపడుతూ విమర్శించారు.
వాళ్లు (మీడియా) నచ్చితే వ్యక్తులను పైకి లేపుతారు. లేకుంటే తొక్కేస్తారు. కానీ నన్ను కాపాడుకునే బాధ్యత ఈ ఏడుకొండలవాడికి, నేను పూజించే దేవీ దేవతలకు అప్పజెప్పేసి నా పని నేను చూసుకుంటాను.
ఓ ప్రముఖ నిర్మాత నా దగ్గరకు వచ్చారు. మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న తన భారీ బడ్జెట్ సినిమా సూపర్హిట్ అవ్వాలని కోరగా, దాని కోసం మూడు రోజులుగా ఈ హోమం చేస్తున్నాను.
ఇప్పుడు నన్ను మళ్లీ సమంత–రాజ్ నిడిమోరు గురించి అడుగుతున్నారు. నేను ఏం చెప్పినా తప్పే అవుతుంది. కనుక నేనేమీ మాట్లాడ దలుచుకోలేదు,” అని చెప్పారు.
వేణు స్వామికి ఇతరుల జాతకాలు చూసి జరగబోయేది చెప్పగలిగే శక్తి ఉంది. కనుక ముందుగా తన జాతకం చూసుకుని బాగుందా లేదా? అని తెలుసుకుంటే బాగుండేది. బాగాలేదని తెలిసి ఉండగా మాట్లాడకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది.
కానీ ఆయన ‘నేనేమీ మాట్లాడను’ అంటూనే, ‘ఓ పెద్ద నిర్మాత… మూడు రోజుల్లో విడుదల కాబోయే పెద్ద సినిమా…’ అంటూ మాట్లాడటం అవసరమా?
Many thought Bigg Boss 20 would not be as interesting as the earlier seasons, especially…
For the first time in Bigg Boss history, there is a double eviction in the…