
కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఓటు వేయలేదని, చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి లాలూచీ పడ్డారని గతంలో ఎన్నో సందర్భాలలో జగన్ వ్యాఖ్యానించారు, విమర్శించారు కూడా! అలా కాంగ్రెస్ కు సహకారం అందించి, అయిదేళ్ళ పాటు కాంగ్రెస్ రాక్షస పాలనకు కారణమయ్యారని, అలాగే రాష్ట్ర విభజన కూడా ఆ ప్రభుత్వం ఉండడం వలనే జరిగిందని, దీనికి కూడా చంద్రబాబే కారణమని జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే జరిగిన వాస్తవం ప్రజలకు తెలుసనుకోండి… అది వేరే విషయం..!
ఇక, వర్తమానం విషయానికి వస్తే… అదే జగన్… దాదాపుగా 24 గంటల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ఆ పార్టీలోకి ఎవ్వరూ వెళ్ళరని, ఇంకా చెప్పాలంటే 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలే తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, తానూ తలుచుకుంటే ఒక్క గంటలో ప్రభుత్వం పడిపోతుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీ అయినా జగన్ మాదిరే ఆలోచనలు చేస్తుంది. ఎప్పుడు అధికార పార్టీని గద్దె దింపుదామా? ఎప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్దామా… అని..!
మరి గంటలో ప్రభుత్వాన్ని పడగొడతానని చెబుతున్న జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? గతంలో జగన్ వ్యాఖ్యలను పరిశీలనలోకి తీసుకుంటే… చంద్రబాబు అంటే విపరీతమైన ప్రేమతో కూడిన అభిమానముందా? లేక సిఎం హోదాలో ఉన్న చంద్రబాబుతో లాలూచీ పడ్డారా? లేకుంటే జగన్ చెప్తున్నట్లు చంద్రబాబు రాక్షస పాలనను సమర్థిస్తున్నారా? అదీ కాక ప్రసుత్తం ఏపీ ఉన్న పరిస్థితులను విశ్లేషణ చేస్తే… “ఏపీలో అధికారం అన్నది నెత్తి మీద కుంపటి”లా మారడంతో… దానిని మోసే సామర్ధ్యత తన వద్ద లేవని తెలుసుకున్నారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల నుండే పుట్టుకొస్తున్నాయి.
రాజకీయ ఆధిపత్యం కోసం ఆరోపణలు సహజమే అయినా, అవి సత్యానికి దగ్గరగా ఉంటేనే ప్రజలు వాటికి విలువనిస్తారు. లేకుంటే ఏం మాట్లాడినా… గాలికొదిలేస్తారని గమనించాలి. ముఖ్యంగా ఒక పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఉన్న వారే అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తుంటే… ఇక రాజకీయంగా ప్రజలకు ఆ నాయకుడిపై విశ్వాసం ఎప్పటికి వస్తుంది? నిజంగా 20 ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వచ్చేస్తారంటూ జగన్ చెప్పినది నిజమే అయితే, రాజకీయాల్లో ఉన్న ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఒక్క నిముషం కూడా ఉపేక్షించదు. మరి అలాంటి వ్యాఖ్యలు ప్రజలు నమ్మరని తెలిసి కూడా జగన్ ఎందుకు చేస్తున్నారో అని తలలు పట్టుకోవడం… ఆ పార్టీ నేతల వంతవుతోందని రాజకీయ వర్గాల మాట.
The Federation of Indian Pilots has raised fresh concerns regarding the cause of the deadly…
Vijay is dominating headlines again, this time for politics, not films. The latest assembly election…