
alla-nani-political-journey-death
మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని నేడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటు తో మృతి చెందారు. ఆయన హఠాన్మరణంతో ఏపీ రాజకీయాలలో, ముఖ్యంగా టీడీపీ పార్టీలో విషాద వాతావరణం ఏర్పడింది.
ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు, ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియచేసారు. 56 ఏళ్ళ వయస్సులోనే నాని ఇలా గుండెపోటుతో తుది శ్వాస విడవడం బాధకారం అంటూ బాబు, వివాదరహితుడు, అందరితో స్నేహ పూర్వకంగా మెలిగే నాని ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ లోకేష్ తమ సంతాపాన్ని తెలియచేసారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం తన పార్టీ మాజీ మంత్రి మృతి పై స్పందిస్తూ నాని మరణ వార్త తనను కలచివేసిందని, ఇటువంటి కష్టకాలంలో వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నట్టు నాని మృతి పై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.
నాని రాజకీయ ప్రయాణం నుంచి ఆయన తుది శ్వాస వరకు ఆయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే…
వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఆళ్ళ నాని తొలుత కాంగ్రెస్ పార్టీ తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994,1999 లో ఎన్నికలలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
ఓటమితో వెనుకడుగు వేసేదెలా అంటూ 2004 ఎన్నికలలో ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా తన జయకేతాన్ని ఎగరేశారు నాని. ఇక 2009 లోను తన విజయాన్ని కొనసాగించిన నాని వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ ను వీడి 2013 లో వైసీపీ పార్టీలో చేరారు.
ఇక రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికలలో ఆళ్ల నాని వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. దీనితో 2017 లో వైసీపీ ఎమ్మెల్సీ గా బాధ్యతలు తీసుకున్న నాని 2019 ఎన్నికలలో తిరిగి ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే గా గెలుపొందారు.
ఇలా ఆళ్ళ నాని రాజకీయ ప్రస్థానంలో ఏలూరు నియోజకవర్గం కీలక పాత్ర పోషించదనే చెప్పాలి. 2019 లో విజయం సాధించిన నాని వైసీపీ ప్రభుత్వంలో, జగన్ క్యాబినెట్ లో 2022 వరకు డిప్యూటీ సీఎం గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
అటు పిదప పార్టీలో వచ్చిన అంతర్గత విభేదాల కారణంగా, 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆళ్ల నాని వైసీపీ ని వీడి టీడీపీ జెండా పట్టుకున్నారు. 2025, ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఇలా ఆళ్ళ నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలుపెట్టి, వైసీపీ…చివరికి టీడీపీ తో ముగిసిపోయింది. ఏలూరు రాజకీయాలలో ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా, క్యాబినెట్ మంత్రిగా, మాజీ మంత్రిగా సాగిన ఆళ్ల రాజకీయం, ఆయన హఠాన్మరణం ఏలూరు రాజకీయాలకు తీరని లోటనే చెప్పాలి.
Sundeep Kishan is starring in the debut directorial of Jason Sanjay, Sigma. Tamil Nadu CM…
A high-profile Ganpati celebration in Mumbai reportedly turned awkward for a young Bollywood actress and…