
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కానీ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం చెపుతోంది.
ప్రభుత్వాసుపత్రులు, వాటికి అనుబందంగా పనిచేసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే నిరుపేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని వైసీపీ వాదిస్తోంది. దాని వాదనలో సహేతుకత ఉంది. కానీ నాడు వైఎస్ హయంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ని నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు, పార్టీలకు అతీతంగా కొనసాగిస్తున్నాయి కదా? దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి కదా?
సామాన్య పేద ప్రజలకు ప్రభుత్వాసుపత్రులు అందుబాటులో ఉన్నప్పుడు, ‘ఆరోగ్యశ్రీ’ పధకం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది?అంటే ప్రభుత్వాసుపత్రులలో అరకొర సౌకర్యాలు, నిపుణులు, వైద్య పరికరాల కొరత, ఇంకా అనేక సమస్యలున్నాయని అందరికీ తెలుసు. కానీ ఏ ప్రభుత్వమూ ఇది ఒప్పుకోదు. కనుక పేద ప్రజలకు కూడా కార్పోరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంది.
దీని కోసం కార్పోరేట్ ఆసుపత్రులకు ఏటా వందల కోట్లు చెల్లిస్తుంటాయి. ఏటా అన్ని వందల కోట్లు ప్రభుత్వాసుపత్రులకే కేటాయిస్తే వాటిని కార్పోరేట్ హాస్పిటల్స్ స్థాయిలో నిర్మించవచ్చు… నిర్వహించవచ్చు కదా?
కానీ ప్రభుత్వాసుపత్రుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వాలు, కార్పోరేట్ హాస్పిటల్స్ పట్ల కన్నబిడ్డ కంటే ఎక్కువ మమకారం ఎందుకు చూపుతున్నాయి?అనే ప్రశ్నకు కారణం అందరికీ తెలుసు. చెప్పుకుంటే సిగ్గుచేటు!
తొలిసారి ‘ఆరోగ్యశ్రీ’తో వైద్య వ్యాపారాన్ని ప్రోత్సహించినప్పుడే ప్రభుత్వ వైద్య రంగం ప్రైవేటీకరణ జరిగింది. నేటికీ ‘ఆరోగ్యశ్రీ’ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతూనే ఉంది. కనుక ఆరోగ్యశ్రీ గురించి వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది కదా?
For the past few months, Indians booking H-1B slots have only seen the No Slots…
RJ Charan made a re-entry to the Bigg Boss TV show in the latest episode,…