
ఎక్కడ కృష్ణమ్మ.. ఎక్కడ మదనపల్లె.. కానీ కృష్ణా జలాలు (హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు) మదనపల్లె సమీపంలోని చిప్పిలి ప్రాంతానికి, అక్కడి నుంచి కొల్లాబైలు కాలువ నెట్వర్క్కు చేరుకున్నాయి. దశాబ్దాలుగా తాగుసాగు నీటికి కటకటలాడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు కృష్ణమ్మ తరలిరావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి కాలువలలో నిండుగా పారుతున్న ఆ నీటిని చూసి మురిసిపోతున్నారు. ఎక్కడికక్కడ జలహారతులిచ్చి కృష్ణమ్మకి స్వాగతం పలుకుతున్నారు.
మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా, కూటమి పార్టీల నేతలు, స్థానిక ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు జలహారతినిస్తుంటే అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది.
చించినాడ, మాల్యాల నుండి వస్తున్న ఈ నీటిని మదనపల్లెలోని అమ్మ చెరువుకి అక్కడి నుంచి కాలువల ద్వారా ముందుగా చిప్పిలి చెరువు, ఎస్ఎస్ చెరువు, గుద్దివారిపల్లి చెరువులను నింపబోతున్నారు. దీని కోసం నాలుగు పంప్ హౌసులు నిర్మించారు.
ఈ మూడు చెరువులు నింపిన తర్వాత రాబోయే రోజుల్లో బసినికొండ చెరువు, ఇసుకునూతిపల్లె చెరువు, స్వామి చెరువు సహా చుట్టుపక్కల ఉన్న పదహారు చెరువులు మరియు కుంటలను ఈ నీటితో నింపనున్నారు.
50 వేలకు పైగా జనాభా కలిగిన మదనపల్లె పట్టణానికి దీంతో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది. దీని కోసం రామిరెడ్డి లేఅవుట్, నీరుగుట్టువారిపల్లె తదితర ప్రాంతాలలో భారీ భూగర్భ సంపులు నిర్మించి సిద్ధంగా ఉంచారు. వాటిని నింపి అక్కడి నుంచి పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరోవైపు పుంగనూరు, తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాలకు నీటిని చేరవేయడానికి కదిరి సమీపంలోని చెర్లోపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. దీని పూర్తి సామర్థ్యం 1.618 టీఎంసీలు.
పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగునీరు అందించే కుప్పం బ్రాంచ్ కెనాల్ నెట్వర్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకి ఈ పనులు పూర్తవుతాయి. ఈలోగా చెర్లోపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం 1.2 టీఎంసీలకు చేరుకుంటుంది. అప్పుడు పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు.
కృష్ణా జలాలు రాకతో జలాశయాలు, చెరువులు నిండితే, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. కనుక చుట్టుపక్కల ఎండిపోయిన బోరుబావులన్నీ మళ్ళీ రీఛార్జ్ అయ్యి నీటి కొరత తీరుతుంది.
పాలకులకు దూరదృష్టి, నిబద్దత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. తమ జిల్లాలకు కృష్ణమ్మ జలాలు రప్పించిన అపర భగీరధుడని ప్రజలు ప్రశంశిస్తున్నారు. నిజమే కదా?
Katrina Kaif stepped out for a public event after becoming a mother, and instead of…
The Enforcement Directorate’s arrest of Sukriti Foods promoter Kailash Chand Mangla has brought fresh attention…