
ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నెలన్నర తర్వాత అంటే 2024, జూలై 21 మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కొన్ని అతి ముఖ్యమైన ఫైల్స్ తగులబడ్డాయి.
ఈ అగ్నిప్రమాదంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూకబ్జాలకు సంబందించిన ఫైల్స్ దగ్ధం అయినట్లు సమాచారం.
అప్పుడే ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ అగ్నిప్రమాదం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముఖ్య అనుచరుడు మాధవ రెడ్డి, పెద్దిరెడ్డి పీఏ ముని తుకారం హస్తం ఉందని నిర్ధారించుకొని వారిపై కేసు నమోదు చేసి ఏ3, ఏ4గా చేర్చారు.
వారిద్దరినీ నేడు చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. అన్ని కేసుల్లాగే ఇది కూడా రెండేళ్ళుగా నత్త నడకన సాగుతూ ఇప్పటికి ఇద్దరిని అరెస్ట్ చేయడం వరకు వచ్చి ఆగింది.
గత ఏడాది డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్లో చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములలో హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆక్రమించుకున్న 76.74 ఎకరాల భూమికి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఆ ఆక్రమణలపై అటవీశాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వయంగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటించి ఆదేశాలు జారీ చేస్తే ఆ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో ఎవరికీ తెలీదు.
అంతకు ముందు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో విదేశాలకు రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ షిప్పుని సముద్రంలో వెంటాడి పట్టుకొని ‘సీజ్ ది షిప్’ అన్నారు. ఆ తర్వాత ఆ కేసు ఊసే వినపడలేదు.
మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసు కథ కూడా అలాగే అటకెక్కిపోయింది. ఆ కేసు విచారణ జరిపించాలని స్వయంగా పేర్ని నాని సవాలు చేసినా కూటమి ప్రభుత్వం స్పందించలేదు!
కనుక ‘మదనపల్లి ఫైల్స్’ వెబ్ సిరీస్లో ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో… అవెప్పటికి పూర్తవుతాయో ఎవరికీ తెలియదు.
Ram Charan’s Peddi is already carrying huge expectations as one of the biggest Telugu releases…
The main narrative that was carried by previous chief minister of Andhra Pradesh, YS Jagan…