
నిజానికి ఈ సభ ద్వారా అభిమానులు గానీ, ప్రజలు గానీ ఆశించింది ఏంటి? ప్రధాన అంశాలు తీసుకుంటే… మొదటగా స్పెషల్ స్టేటస్ పై పవన్ ఏం చేయబోతున్నారు? వచ్చే ఎన్నికలలో ఎన్ని స్థానాలలో జనసేన పోటీ చేయబోతోంది? వచ్చే ఎన్నికలలో ఎవరెవరు జనసేన తరపున బరిలోకి దిగబోతున్నారు? ఇలా పార్టీ పరంగా గానీ, జనసేన పరంగా గానీ పవన్ స్పష్టత ఇస్తారని భావించిన వారికి నిరుత్సాహం కలిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికారంలో ఉన్న టిడిపిని ఎన్నడూ లేనంతగా విమర్శించిన పవన్, కొన్ని లాజిక్స్ మిస్సయ్యారని చెప్పవచ్చు.
పవన్ చెప్పినట్లు… ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి చాలా ఉంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. గతంలో బహిరంగంగానే చంద్రబాబు అవినీతిపై చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. అవినీతిని ప్రశ్నించడంలో తప్పు లేదు, నిజానికి ప్రశ్నించాలి కూడా! అప్పుడే అధికార పక్షం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తుంది. ఈ పని ప్రతిపక్షంలో ఉన్న జగన్ చేయనందు వలనే, ఇన్నాళ్ళు టిడిపి నేతల ఆటలు సాగాయి. ఆ మాటకొస్తే… పవన్ కూడా నాలుగేళ్ళుగా చోద్యం చూస్తున్నారా? అని విమర్శించాల్సిన పరిస్థితి. ఈ విమర్శలకు పవన్ కు నూటికి నూరు మార్కులు పడతాయి కానీ, అభివృద్ధి విషయంలో స్పష్టత లేకుండా పవన్ విమర్శలు ఉన్నాయని చెప్పవచ్చు.
అమరావతి కేంద్రంగానే అభివృద్ధి సాగుతోందని పవన్ చెప్పడం… అత్యంత అవగాహనకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఒక్క రాజధాని మినహా అమరావతికి పెద్దగా తరలిన పరిశ్రమలు గానీ, కార్పొరేట్ కంపెనీలు గానీ లేవు. ఆ మాటకొస్తే… కియా, హీరో, ఇసుజు, ఫాక్స్ కాన్ వంటి ఇండస్ట్రీలు ఎక్కడ నెలకొల్పారు? అన్నది ఒక్క ప్రశ్న వేసుకుంటే, మొత్తం విషయం పవన్ కే అవగతం అయ్యేది. పాలనా పరంగా ఉండాల్సిన సౌలభ్యాలన్నీ అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న మాట వాస్తవమే గానీ, అది తప్ప అమరావతిలో ఏం లేదని పవన్ గుర్తించలేదన్నది విశ్లేషకుల మాట.
ఇక, చంద్రబాబు తనయుడు లోకేష్ పైన చేసిన ఆరోపణలలో స్పష్టత కొరవైంది. ఇన్నాళ్ళు పొత్తు పెట్టుకున్నాం కదా, ఒక మాట అని వదిలేద్దాం అన్న రీతిలో ఉందే తప్ప, వాటిల్లో ఏ మాత్రం స్పష్టత లేదు. నిజంగా పవన్ దగ్గర సమాచారం ఉంటే, భయపడడం దేనికి? ప్రజలకు తెలియాలి కదా! జనసేన ఆశయం కూడా అదే కదా! ప్రజలకు కావాల్సింది కూడా అదే! మళ్ళీ ఎందుకు దాస్తున్నారు? అనే దానికి జవాబు లేదు. వైసీపీ చేసిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. అలాగే మోడీ దర్శకత్వంలో మీరు నడుస్తారా? అని నేను ప్రశ్నించాను. దానికి మీరు జవాబు చెప్పాల్సి ఉందని జగన్ మోహన్ రెడ్డిని కాస్త ఇరకాటంలోనే పెట్టారు.
నిజానికి జగన్ ను ఈ ప్రశ్న వేయడానికే ఈ సభ పెట్టినట్లుగా కనపడుతోంది. అయితే మోడీపై జగన్ విమర్శలు చేస్తారనుకోవడం అవివేకమే అవుతుంది. జగన్ కున్న ఇబ్బందులు పవన్ కు తెలియనివి కావు, బాహ్య ప్రపంచానికి కూడా తెలియనివి కావు. బిజెపి – వైసీపీల మధ్య మైత్రీ బంధం ఏ రీతిన ఉందో విజయసాయిరెడ్డి అప్పాయింట్ మెంట్ ద్వారా పవన్ చెప్పకనే చెప్పారు. కానీ మరింత స్పష్టతతో మాట్లాడానికి పవన్ ఇంకా సంశయిస్తున్నారు. ‘తల్లి – బిడ్డ’ న్యాయం మాదిరి పవన్ చేసిన కామెంట్స్ జనసేనకు ఏ రకంగానూ దోహదం చేసేవి కావన్నది స్పష్టం.
ముఖ్యంగా జనాలు ఆశించిన ‘స్పెషల్ స్టేటస్’పై ఇంకా కేంద్రం స్పందించాలని చెప్పడం పవన్ విజ్ఞతకే వదిలేయాలి. ‘మేము ఇవ్వం బాబు, మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ కుండబద్దలు కొట్టిన విధంగా కేంద్రం మాట్లాడుతుంటే, ఇంకా దేనికోసం వేచిచూస్తున్నారో ప్రజలకు అయితే అవగతం కావడం లేదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, అవసరమైతే కాదు, అవసరం పడేలా ఉంది… అంటూ కాస్త సంకేతాలు ఇచ్చినప్పటికీ, పవన్ కామెంట్స్ ప్రజలకు ఊరటను కలిగించలేదు. మొత్తమ్మీద రాజకీయంగా గానీ, పార్టీ పరంగా గానీ ‘జనసేన’కు ఏ మాత్రం ఉపయోగం లేని సభగా ఇది మిగిలిపోయిందని చెప్పవచ్చు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…