
నిన్న రాత్రి హైద్రాబాద్ లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు సినీ ఇండస్ట్రీ అగ్ర హీరోలలో ఒకరుగా తన అభిమానులకు అలాగే ఇతర హీరోల అభిమానులకు, ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తన ఇండస్ట్రీ కి పవన్ కళ్యాణ్ ఒక కీలక సూచన చేసారు.
ముందుగా ఇండస్ట్రీ విషయానికొస్తే, సినిమా టిక్కెట్ రేట్స్ హైక్ గురించి పవన్ సభలో ప్రస్తావించారు. ప్రతి సారి మూవీ రిలీజ్ కి ముందు టికెట్ రేట్ల పెంపు అంటూ ప్రభుత్వాల ముందు దేహి అంటూ చిత్ర బృందం నిలబడం చాల ఇబ్బందిగా ఉందన్నారు.
ఒక సినిమాను మొదలుపెట్టి దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చే క్రమంలో నిర్మాతల నుంచి దర్శకులు, నటీనటుల వరకు పడే కష్టం తనకు తెలుసునన్నారు. అయితే గతంలో కూడా ఇదే విషయం పై పవన్ సినీ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ పెద్దలకు విజ్ఞప్తి చేసారు.
ఎంత బడ్జెట్ సినిమాకి ఎంత టిక్కెట్ ధర ఉండాలి, ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా టికెట్ పై ఎంత హైక్ కావాలి అనేది అందరు కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టాలని, దాని పై సమగ్ర విచారణ జరిపి అందుకు అనుగుణంగా టిక్కెట్ హైక్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ సూచించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే పవన్ ఈ ప్రకటన చేసినప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వానికి ఆ సూచన పట్ల ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు. ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, సినీ ఇండస్ట్రీ అగ్రహీరోగా ఉన్న పవన్ తన ఇండస్ట్రీ వారి ఆత్మగౌరవం కోసం ఈ విధమైన ప్రతిపాదన సూచించినప్పటికీ ఇండస్ట్రీ పెద్దల నుంచి స్పందన ఎందుకు కరువవుతుంది.?
సినీ ఇండస్ట్రీ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆశించడం లేదా.? లేక ఎవరి సినిమా కోసం వారు ప్రభుత్వాల చుట్టూ తిరగడం, అక్కడ కుదరకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడానికే సుముఖత చూపుతున్నారా.? ప్రభుత్వమే ఇలా ముందుకొచ్చి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కోండి, ప్రభుత్వం నుంచి మేము పూర్తిగా సహకరిస్తాం అంటూ విన్నవిస్తున్నా ఇండస్ట్రీ ఎందుకని చెవులు మూసుకుంటుంది.?
సినీ ఇండస్ట్రీ ప్రభుత్వ బెదిరింపులకు లొంగుతుందా.? అధికారం అనే అహానికే తలవంచుతుందా.? అలాగే ఇటు హీరోల అభిమానులు కూడా తమ హీరోల పై ఉండే పిచ్చి అభిమానాన్ని పరిధి దాటి చూపించడానికి సోషల్ మీడియా వేదికలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. దీని పై కూడా పవన్ వారించారు.
హీరోల అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్ల పై కూడా పవన్ మరోమారు స్పందించారు. తనకు మూవీ కలెక్షన్ల పిచ్చి లేదని, సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎవరి హీరో రికార్డులను బద్దలుకొట్టింది అనేదాని మీద తనకు ఏమాత్రం ఆసక్తి ఉండదని, తనకు ఏ హీరో సక్సెస్ పట్ల కూడా అభద్రతా భావం ఉండదన్నారు.
ఇలా హీరోల పేరులు చెప్పుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు చేసుకోవడం తనకు నచ్చదని, ఎవరి హీరోని వారు అభిమానించుకోవడం తప్పు కాదని కానీ అలా ఇతర హీరోల ను అవమానించడం, కించపరిచేలా మాట్లాడడం ఏ హీరో అభిమానులకు సబబు కాదంటూ హితవు పలికారు.
అయితే తాజాగా ఉస్తాద్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా సోషల్ మీడియా ఒక పోస్ట్ కి ఇచ్చిన రిప్లై తో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ట్రోల్స్ కి గురై చివరికి మహేష్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మరి పవన్ చేసిన ఈ సూచనల పై ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి స్పందన వస్తుందా.? అభిమానుల నుండి స్పందన ఆగుతుందా.?
ఏదిఏమైనా పవన్ మాదిరే మిగతా అగ్ర హీరోలు కూడా తమవంతుగా ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ పై స్పందిస్తూ తమ అభిమానులకు ఇటువంటి చర్యలు సమంజసం కాదని వారిస్తే రానున్న రోజులలో అయినా ఈ ఫ్యాన్ వార్స్ ప్రభావం కాసంత తగ్గే అవకాశం ఉంటుందేమో చూడాలి..!
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…
Anju Kurian is serving major fashion inspiration with her latest sun-drenched ethnic look. Dressed in…