
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ, ప్రతీ నాయకుడు వాడేసుకుంటూ కనిపెట్టిన ఆయన క్రెడిట్ కూడా చోరీ చేసేస్తున్నారు.
ఆంధ్రాలో వైసీపీ ఎక్కువగా ఈ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. అంటే ఆ పదాన్ని వాడేసుకుంటూ చోరీ అన్న మాట. ఒక్క అమరావతి విషయంలో తప్ప సిఎం చంద్రబాబు నాయుడు తుమ్మినా దగ్గినా క్రెడిట్ చోరీ అని వాదిస్తోంది.
భోగాపురం విమానాశ్రయం.. మేమే కట్టాము. కానీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వెలిగొండని నేనే జాతికి అంకితం చేశా! కానీ చంద్రబాబు నాయుడు! పోలవరం నీళ్ళు విశాఖకు మేమే.. కానీ చంద్రబాబు నాయుడు..! ఇలా అరిగిపోయిన రికార్డులా వైసీపీ క్రెడిట్ చోరీ పాట ప్రతీరోజూ వినిపిస్తూనే ఉంది. అంటే ప్రతీరోజూ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ అభివృద్ది పనులు జరుగుతూనే ఉన్నాయన్న కదా?
ఎవరు కొబ్బరికాయ కొడితే వారికే క్రెడిట్ అనుకుంటే, అధికారంలో ఉన్నప్పుడే ప్రతీ ఒక్కరూ నూటొక్క కొబ్బరికాయలు కొట్టేయవచ్చు. కానీ వాటిని పూర్తిచేసి గుమ్మడి కాయ కొట్టడమే చాలా కష్టం. కనుకనే జగన్ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. కనీసం అన్నాడీఎంకే క్యాంటీన్లు, ఫిష్ ఆంధ్రాలు కూడా నడిపించలేక చేతులెత్తేసింది.
అందుకు దానిని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తుంటే ‘క్రెడిట్ చోరీ’ పాడుతుంటే జనం నవ్వుకుంటారు కదా?
సరే! క్రెడిట్ చోరీ పాట అలవాటు అయిపొయింది కనుక అలవోకగా పాడేస్తున్నారని సర్ది చెప్పుకున్నా, మళ్ళీ అదే నోటితో సోషల్ మీడియాలో “అది కూలిపోయింది. ఇది మునిగిపోయింది. అక్కడ లీక్ అయిపొయింది…” అంటూ సన్నాయి నొక్కులు నొక్కడమే పొరపాటు.
ఒక పని తాలూకు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు, ఆ సంగతి మరిచిపోయి మళ్ళీ దానిలో లోపాలు ఉన్నాయంటూ కొత్త వాదన చేస్తే, మన తప్పులను మనమే ఎత్తిచూపుకున్నట్లు అవుతుంది కదా?
సిఎం చంద్రబాబు నాయుడు నిన్న పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి నీళ్ళు విడుదల చేసి జల హారతి ఇచ్చారు.
వెంటనే వైసీపీ క్రెడిట్ చోరీ రికార్డ్ వేశాక, తుని-పాయకరావుపేట మద్య తాండవ నదిపై ఆక్వాడక్ట్ నిర్మాణంలో బయటపడిన డొల్లతనం. అక్వాడక్ట్ నుంచి అప్పుడే లీకేజ్… వృధాగా పోతున్న గోదావరి నీళ్ళు,” అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టింది.
అంటే దీనిని చంద్రబాబు నాయుడు నిర్మింపజేశారని అంగీకరిస్తున్నట్లే కదా? మరి క్రెడిట్ చోరీ పాట దేనికి? అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ, “పోలవరం ఎడమ ప్రధాన కాలువలో కొన్ని చోట్ల లీకేజీ ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. కాంక్రీట్ ఆక్వెడక్ట్ గ్రౌటింగ్ పనులు జరుగుతున్నప్పుడు ఫోటోలు తీసి ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు.
సాధారణంగా కొత్తగా నిర్మించిన కాంక్రీట్ ఆక్వెడక్ట్లలో భారీగా నీరు ప్రవహించిన తర్వాత జాయింట్ల అంచులు, జాయింట్ల వద్ద నీటి సీపేజ్ (లీకేజీ)లు ఏర్పడుతుంటాయి. అలాగే ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అక్వాడక్ట్ జాయింట్లలో ఉండే ఎయిర్ గ్యాప్స్/ ఎయిర్ పోకెట్స్ ఉంటే ఇంజనీర్లు వాటిని గుర్తించి, పరిశీలించిన తర్వాత సిబ్బంది గ్రౌటింగ్ పనులు చేసి వాటిని మూసేస్తారు. ప్రస్తుతం ఇవే పనులు జరుగుతున్నాయి. వాటిని చూపించి ‘నాసి రకం పనులు, అక్వాడక్ట్ లీకేజ్ అంటూ…’ తప్పుడు ప్రచారం చేయడం సరికాదు,” అని ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ స్పష్టం చేశారు. అర్దమయిందా రాజా?
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…