
అవును! ఈరోజు సోషల్ మీడియాలో ఈ మాట వినిపించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న మూసి ప్రాజెక్టు… దానిలో భాగంగా గాంధీ విగ్రహం ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో నిర్వాసితులు, “కేసీఆర్ని కాదని మీకు ఓట్లేసి గెలిపిస్తే మా ఇళ్ళు కూల్చేసి రోడ్డున పడేస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేటీఆర్, హరీష్ రావులైతే చెప్పక్కరలేదు. ఓ 10-15 వేల కోట్లతో మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేస్తే సరిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్ల కోసం లక్షకోట్ల ప్రాజెక్టుగా మార్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నేతలలో కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఈ ప్రాజెక్టు భుజాని కెత్తుకున్నారని కేటీఆర్, హరీష్ రావు పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు.
చివరికి గాంధీజీ మనుమడు తుషార్ గాంధీ కూడా గాంధీ విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అది ప్రజాస్వామ్యానికి, గాంధీజీ ఆశయాలకు విరుద్దమే అని ఖరాఖండీగా చెప్పారు.
ఇలా ముప్పేట దాడికి గురవుతుంటే ఎంత గుండె నిబ్బరం ఉన్న సిఎం అయినా పునరాలోచనలో పడకమానరు. కానీ సిఎం రేవంత్ రెడ్డి అలా భయపడే వెనకేసే రకం కాదు. అందుకే ఈ విమర్శలు, ఆరోపణలు, వివాదాలు ప్రతీ దానికీ మొన్న హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ‘మూసీ ఇన్వైట్స్’ సదస్సులో దీటుగా సమాధానాలు చెప్పారు.
నాడు బ్రిటిష్ వారు, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే దానిని మనం వాడుకుంటున్నాము. అలాగే మనం కూడా మన భావితరాలకు నగరాన్ని అభివృద్ధి చేసి అందించాల్సిన బాధ్యత మనకు లేదా?ప్రాజెక్టులో కొందరికి నష్టం కలుగుతుందని దాని వలన ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుందని భయపడితే అవుటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు నిర్మించుకోగలిగేవారమా?
నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని విమర్శిస్తున్నారు. యస్! రియల్ ఎస్టేట్ లేకుండా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా?
నేను పేద ప్రజల ఉసురుపోసుకుంటే నాకే నష్టమని నాకు తెలీదా? తెలిసి తెలిసి నేను వాళ్ళని రోడ్డుపై పడేయాలని ఎందుకనుకుంటాను? నిర్వాసితులందరికీ ఇళ్ళు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వారికి ఇక్కడే భారీగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు పక్క ప్రణాళికలతోనే అడుగు ముందుకు వేస్తున్నాను.
గాంధీ విగ్రహానికి 60-70 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాము. కానీ 5,000 కోట్లని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. బుద్దున్నవాడు ఎవడైనా విగ్రహాల మీద అంత ఖర్చు చేస్తాడా? విజ్ఞాన్ భవన్లో, పార్కులు మొత్తం అన్నీ కలిపి 150-200 కోట్ల లోపే!” అంటూ సిఎం రేవంత్ రెడ్డి చాలా వివరంగా ప్రతీ విమర్శకు సమాధానం చెప్పారు.
అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ప్రాజెక్టు గురించి అయన సమాధానాలు చెప్పి, ఈ ప్రాజెక్టు ప్రయోజనాలను ఇంత చక్కగా వివరించిన తీరుని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో విశేషమేమిటంటే, “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి అనేక భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కానీ తాను చేస్తున్న పనుల గురించి రేవంత్ రెడ్డిలా చక్కగా వివరించలేరు,” అని సోషల్ మీడియాలో కొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగాలు విన్నవారికి వారి వ్యాఖ్యలు సబబుగానే అనిపిస్తాయి. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, గతంలో జగన్ బ్యాచ్ చేత తెలుగు మాట్లాడటం రాదని తీవ్రంగా అవహేళన చేయబడిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తండ్రి కంటే చాలా చక్కగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగాలు సుదీర్గంగా సాగుతుంటే, మంత్రి నారా లోకేష్ ప్రసంగాలు చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా సాగుతుంటాయనే టాక్ ఇప్పుడు తరచూ వినిపిస్తూనే ఉంది.
చివరిగా ఒక మాట: చేస్తున్న పనుల గురించి రేవంత్ రెడ్డిలా ప్రజలకు సమర్ధంగా చెప్పుకోవడం చాలా అవసరం. కనుక కూటమి ప్రభుత్వంలో ఎవరో ఒకరికి ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పగిస్తే మంచిదేమో?
The 41st match of IPL 2026 between Mumbai Indians and Sunrisers Hyderabad at Wankhede Stadium…
Prakash Raj has built an image as a fearless political voice, someone who questions power…