
ముద్రగడ పద్మనాభం, బహుశా ఈపేరు తెలియనివారు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు కావొచ్చు. కాపుల హక్కుల కోసం, కాపుల ఐక్యత కోసం బలమైన పోరాటాలు చేసిన వ్యక్తి. ఆయన జాతి కోసం పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి ముద్రగడ తాజాగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన తీవ్ర భావోద్వేగంతో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తునిలో జరిగిన రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ ముద్రగడను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తూ బహిరంగ లేఖ రాశారు. ఉద్యమమే ఊపిరిగా, పోరాటమే జీవితంగా బ్రతికే వ్యక్తినని, తనని నమ్మిన వ్యవస్థని, తన జాతిని ఎవరికి అమ్మకానికి పెట్టడం గాని, తాకట్టు పెట్టడం గాని చేయలేదని ముద్రగడ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
తన తాత, తండ్రుల బాటలోనే తాను కూడా నడుస్తున్నట్లు ముద్రగడ ప్రజలకు గుర్తుచేశారు. తనని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టాలని చూశారని, కానీ ఆయన ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదని అన్నారు. జీవితంలో తాను ఎప్పుడూ కోర్టుకు వెళ్ళలేదని, తుని ఘటనతో తాను కోర్టు మెట్లు ఎక్కానని, క్రమం తప్పకుండా కోర్టు వాయిదాలకు హాజరయ్యానని ముద్రగడ లేఖలో తెలిపారు.
తుని రైలు ఘటన పూర్తి బాధ్యత తనదే అంటూ సొంత సామాజికవర్గానికి చెందిన కొంతమంది కాపు నాయకులే కోర్టుకు వెళ్ళడం తనని తీవ్రంగా బాధించిందని ముద్రగడ లేఖ ద్వారా తన బాధని ప్రజలకు తెలిపారు. ఇప్పటికీ తనలో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదని, తుని ఘటనలో కోర్టు తనకు ఉరిశిక్ష వేసినా తాను ఎలాంటి అప్పీల్ కి వెళ్ళనని ముద్రగడ స్పష్టం చేశారు.
పదవులపై కూడా తనకి ఎలాంటి ఆశలు లేవని ఆయన అన్నారు. గతంలో ఎన్నో పదవులు వదులుకున్నట్లు ముద్రగడ తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో మంత్రి పదవి ఇస్తానన్నా తాను తీసుకోలేదని ముద్రగడ తెలిపారు.
రైల్వే కోర్టులో న్యాయం గెలిచిందని ముద్రగడ అన్నారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు ఆయన లేఖ ద్వారా తెలిపారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ప్రకటన చేస్తారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
There’s a strange trend in film discussions today. A film becomes a blockbuster, and suddenly,…
After Dhurandhar: The Revenge, Ranveer Singh is preparing to present a new side of himself…