Telugu

అవినీతికే అసూయ పుట్టేలా!

‘బిజినెస్ మేన్’ సినిమాలో హీరో మహేష్ బాబు ‘ముంబైలో ఏదోలా బతికేద్దామని రాలేదు… ముంబైని xx పోయించడానికి వచ్చాను…’ అంటూ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా! అచ్చం అలా అనుకున్నాడో లేదో కానీ అవినీతికే అసూయపుట్టేలా, ఇంత అవినీతి చేయొచ్చా? అనేలా ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు ఆస్తులు సంపాదించడం ఏపీలో కలకలం రేపుతోంది. 1988 మే 11వ తేదీన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా జాయినైన గొల్ల వెంకట రఘు అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లలో వివిధ హోదాల్లో పనిచేశారు.

ADVERTISEMENT

1996లో డిప్యూటీ డైరెక్టర్‌ గా ప్రమోషన్‌ అందుకుని, ఆ హోదాలో నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్‌ లో పనిచేశారు. ఆ తరువాత 2002లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు సిటీ ప్లానర్‌ గా వచ్చారు. మళ్లీ 2004లో జాయింట్ డైరెక్టర్‌ గా పదోన్నతి పొంది విశాఖ జీవీఎంసీకి ట్రాన్స్‌ ఫర్ అయ్యారు. 2009 నవంబర్‌ లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ గా పనిచేశారు. అక్కడే డైరెక్టర్‌ గా ప్రమోషన్‌ అందుకున్నారు. చివరగా 2015లో డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ గా ప్రమోషన్ పొందారు. మరో వారం రోజుల్లో రిటైర్ కానున్న ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో రఘు అతని బినామీలు, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో విస్తుపోయే ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 500 కోట్ల రూపాయల అక్రమాస్తులు చూసి నోరెళ్ల బెట్టారు. ఒక్కసారి అతని ఆస్తులను పరిశీలిస్తే… కృష్ణాజిల్లా గన్నవరం వద్ద 300 ఎకరాల్లో వెంచర్, బొమ్ములూరులో 1,033 చదరపు గజాల ఇంటి స్థలం, తాడేపల్లిలో నివాస స్థలాలు, మంగళగిరి కొండపనేని లేఅవుట్‌ లో 220 చదరపు గజాల స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో 2 ప్లాట్లు, విశాఖలోని బీచ్ రోడ్డులో 80 లక్షల విలువైన ఫ్లాట్, షిర్డీలోని సూరజ్ కుంజ్ లాడ్జ్, డూప్లెక్స్‌ హౌస్‌, 12 లక్షల రూపాయల విలువైన బంగారం, 5 లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలు, 10 లక్షల రూపాయల నగదు, మంగళగిరిలోని రఘు నివాసానికి సమీపంలోని ఒక అపార్ట్‌ మెంట్‌ లో చెందిన రెండు కార్లను గుర్తించారు.

అలాగే ఆయన బినామీ అయిన శివప్రసాద్‌ (గుణదల) నివాసంలో భారతీనగర్‌ లో 16 ఫ్లాట్లు, గన్నవరం సమీపంలోని చినఅవుట్‌ పల్లి 1.40 ఎకరాల్లో సాయి మిథిల కన్వెన్షన్‌ హాల్‌. శివప్రసాద్ భార్య గాయత్రి పేరుతో భారతీనగర్, గుణదలలో రెండు భవనాలు. మరికొన్ని చోట్ల 11.65 ఎకరాల పొలముంది. అంతేకాకుండా ఆమె పేరు మీద సాయి సదన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబురి బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీ మాతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనే కంపెనీలున్నాయి. వారి కుమార్తె పేరుతో భారతీనగర్‌ లో 80 లక్షల రూపాయల విలువైన స్థలం అలాగే హైదరాబాదులోని కొండాపూర్‌ లో ఒక ప్లాట్‌ ఉంది.

శివప్రసాద్‌ కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద విజయవాడలోని గుణదల, భారతీనగర్, కృష్ణాజిల్లాలోని పోతేపల్లి, బొమ్ములూరు, గుంటూరు జిల్లా కటికలపూడి, సుకృతికోటపాడు ప్రాంతాల్లో 18కి పైగా ఖరీదైన ఇళ్ల స్థలాలు. 8 కేజీల బంగారు, వజ్రాభరణాలు, 23 కేజీల వెండి వస్తువులు. 44 లక్షల రూపాయల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు చిత్తూరు జిల్లా రాంపల్లెలోని రఘు అత్త కళావతమ్మ ఇంట్లో కొన్ని ఆస్తులు. అతని బినామీ విశాఖ ఆశీల్‌ మెట్టలోని ప్రైవేటు సర్వేయర్‌ గోవిందరాజు ఇంట్లో రఘుకి సంబంధించిన 2.5 లక్షల రూపాయల నగదు, పలు రికార్డులు స్వాధీనపరుచుకున్నారు.

కిర్లంపూడిలోని రఘు స్నేహితుడు కాంట్రాక్టర్‌ భాస్కరరెడ్డి ఇంట్లో సోదాలు చేసి, పలు రికార్డులు తీసుకెళ్లారు. మరోసారి సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆయన నివాసం దగ్గరకి వెళ్లగానే… ఏసీబీ అధికారుల బృందాన్ని చూసిన రఘు, వారిపై రఘు ఆగ్రహం వ్యక్తం చేసి, తన ఇంట్లోకి రావొద్దంటూ కేకలు వేశారు. అంతేకాకుండా అరెస్ట్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. రఘు ఆస్తులు చూస్తూ నోరెళ్ళబెట్టడం సామాన్య ప్రజల వంతవుతోంది. అవినీతి కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు ‘బ్రాండ్ అంబాసిడర్’లుగా మారుతున్నారని వస్తోన్న విమర్శలకు రఘు లాంటి వారు మరింత బలాన్ని అందిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

9 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

9 hours ago