
నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు, చేర్పులతో వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతుంటే, ‘రా కదిలి రా…’ సభలలో చంద్రబాబు నాయుడు మండపేట, అరుకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించడంతో ఇప్పుడు టిడిపిలో, టిడిపి-జనసేనలు మద్య కూడా అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్ధిగా జోగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు అభ్యర్ధిగా దొన్నదొరను చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.
అరకు నుంచి టిడిపి సీనియర్ నేత అబ్రహం పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్ళుగా నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తనని కాదని దొన్నదొరని టిడిపి అభ్యర్ధిగా ప్రకటించడంతో అబ్రహం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ఇంతకాలంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే నన్ను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడం సరికాదు. నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికలలో తప్పకుండా గెలుస్తాను. అరకు సీటుని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా అందిస్తాను,” అని అబ్రహం అన్నారు.
అరకు అభ్యర్ధి ప్రకటన టిడిపిలో అంతర్గతంగా మంటలు రాజేయగా, మండపేటలో టిడిపి, జనసేనల మద్య మంటలు రగిలాయి.
మండపేట నుంచి జనసేన అభ్యర్ధిగా లీలాకృష్ణ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆయన జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని మండపేటలో చురుకుగా పనిచేస్తున్నారు కూడా. కానీ చంద్రబాబు నాయుడు మండపేటకు టిడిపి అభ్యర్ధిని ఖరారు చేయడంతో ఆయన వెంటనే పార్టీ కార్యాలయంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యి చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు మండపేటకు టిడిపి అభ్యర్ధిని ప్రకటించారు తప్ప ఉమ్మడి అభ్యర్ధిని కాదు. జిల్లాలో జనసేన చాలా బలంగా ఉంది. కనుక పొత్తులలో భాగంగా మండపేట జనసేనకే వస్తుందని నమ్ముతున్నాము. దీనిపై నేను మా అధిష్టానంతో మాట్లాడి ఈ సీటు జనసేన తీసుకోవాలని గట్టిగా చెపుతాను. మండపేట నుంచి జనసేన అభ్యర్ధిగా నేనే పోటీ చేయబోతున్నాను,” అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెండు మూడుసార్లు సమావేశమయ్యి పొత్తులు, సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించారు. ఆ తర్వాతే టిడిపి అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించారని అనుకోలేము.
కనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితర జనసేన పెద్దలు తమ పార్టీలో నేతలకు సర్ధిచెప్పుకోవలసి ఉంటుంది. అదేవిదంగా చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు తదితరులు తమ పార్టీలో టికెట్ ఆశించి భంగపడినవారిని బుజ్జగించుకోక తప్పదు.
టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చే ఉంటారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు వేచి చూడకుండా టిడిపి, జనసేనలు వీలైనంత త్వరగా అభ్యర్ధులను ప్రకటించేస్తే, ఆలోగా ఇటువంటి అసమ్మతి సెగలను చల్లార్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే వైసీపికి అడ్వాంటేజ్గా మారుతుంది.
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…