
తెరాస గా ఉన్న తెలంగాణ రాష్ట్ర పార్టీని జాతీయ రాజకీయాలలోకి తీసుకువెళ్ళడానికి బిఆర్ఎస్ గా పేరు మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అయితే పార్టీ పేరు మారిస్తే కేసీఆర్ రాత మారిపోయినట్టుగా బిఆర్ఎస్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పడం మాట అటుంచితే కనీసం రాష్ట్ర రాజకీయాలలో కూడా పార్టీ ప్రస్తావనే లేకుండా పోయింది.
ఎన్నికల ముందు వరకు కేసీఆర్ కారు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, బీజేపీ నాయకులతో ఓవర్ లోడ్ అయ్యి కూడా దూసుకు పోయింది. కానీ ఒక్క ఓటమితో ఫుల్లీ లోడెడ్ బండి కాస్త ఎంప్టీ అయినా అడుగు ముందుకు వేయలేకపోతుంది బిఆర్ఎస్. ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ తన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తన తొలి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
ఏపీ బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా మాజీ జనసేన నాయకుడు తోట చంద్ర శేఖర్ ను నియమిస్తూ ఆంధ్రాలో రాజకీయాలు మొదలుపెట్టడానికి అన్ని సిద్ధం చేసారు కేసీఆర్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి కేసీఆర్ ఆశల మీద పూర్తిగా నీళ్లుజల్లింది. ఒకవేళ తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీలో కూడా తన అదృష్టం పరిష్కరించుకోవడానికి కేసీఆర్ తన తొలి అడుగు వేసేవారు.
తన మిత్ర పక్షమైన వైసీపీ తో పొత్తుపెట్టుకుని కానీ వైసీపీ కి పరోక్ష మద్దతు ఇస్తూ కానీ కేసీఆర్ ఆంధ్రా రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని ఉబలాటపడ్డారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని ఏపీలో రాజకీయం చేద్దామనుకుంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కూడా కనిపించని దీన స్థితికి కేసీఆర్ దిగజారిపోయారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు కేసీఆర్, తాడేపల్లి ప్యాలస్ నుంచి బెంగుళూర్ ప్యాలస్ కు జగన్ పరిమితమయ్యారు.
అలాగే జాతీయ రాజకీయాలలో కూడా తన మార్క్ రాజకీయం పరిచయం చేద్దామనుకుంటే కవిత లిక్కర్ కేసు అరెస్టు ద్వారా కేసీఆర్ జాతీయ స్థాయిలో మరోలా పరిచయమయ్యారు. తన కూతురు కవిత భారీ స్కాం లో అరెస్టయ్యి నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఇంకా మౌనంగా ఉండడంతో మౌనం అర్దాంగికారమే అంటూ కవిత అరెస్టు తెలంగాణ ప్రజలు సహేతుకంగా భావిస్తున్నారు.
దీనితో కేసీఆర్ మౌనం బిఆర్ఎస్ పార్టీకి శాపంలా మారింది. గతంలో తెలంగాణ అంతటా గులాబీ కండువాలు కనపడే స్థితి నుంచి ఇప్పుడు పార్టీ కార్యక్రమాలలో తప్ప గులాబీ కండువాలు కనిపించని పరిస్థితి. తెలంగాణలోనే బిఆర్ఎస్ కు ఈ పరిస్థితి ఎదురయితే ఇపుడు ఏపీలో బిఆర్ఎస్ జెండా పట్టుకునే నాయకుడు కనిపిస్తాడా.? ఏపీలో తానూ ఎవరి గెలుపు చూడడానికి ఆరాటపడ్డారో, ఎవరి ఓటమి కావాలని ఆశపడ్డారో దానికి విరుద్ధంగా ప్రజాతీర్పు రావడంతో ఏపీ లో బిఆర్ఎస్ కారుకు రోడ్డెక్కకుండానే ఆక్సిడెంట్ అయ్యింది.
గతంలో తెలంగాణలో తెరాస గెలిస్తే ఏపీలో సంబరాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే తెలంగాణలో సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ కబ్జా చేస్తుంది. ఇక ఏపీలో బిఆర్ఎస్ పేరు కూడా వినపడే అవకాశం లేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీని తన మిత్ర పక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి గతంలో తెలంగాణలో గెలిచిన వైసీపీ ఎంపీ లను కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చిన జగన్ ఋణం తీర్చుకుంటారా.?
Tamil Nadu politics delivered a clear verdict beyond the conventional favourites of DMK and AIDMK…
The much-awaited trailer launch event of Peddi is set to take place on May 16,…