
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాలకు సాగు, త్రాగు నీరు అందించేందుకు నిర్మించబడింది. రాష్ట్ర విభజనకు ముందు ఒకే రాష్ట్రంగా ఒకే ప్రభుత్వం అధీనంలో డ్యామ్ నిర్వహణ కొనసాగుతుండేది కనుక ఎటువంటి సమస్య ఉండేది కాదు. దశాబ్ధాలుగా రెండు ప్రాంతాలకు అది నీళ్ళు అందిస్తూనే ఉంది.
కానీ రాష్ట్ర విభజన తర్వాత సాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు రాజకీయ అవసరాలను కూడా తీర్చే వేదికగా మారింది. అటు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా, ఇటు ఆంధ్రాలో ఎన్నికలు వచ్చినా ప్రజలలో సెంటిమెంట్ రగిలించేందుకు సాగర్ డ్యామ్ని వాడుకొంటున్నాయి.
నిన్న తెలంగాణలో పోలింగ్ మొదలవుతున్న సమయంలో ఆంధ్రా అధికారులు పోలీసులను వెంటబెట్టుకొని సాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని, తెలంగాణ పోలీసులను అక్కడి నుంచి తరిమికొట్టి, శ్రీశైలంవైపు గల 13 గేట్లు తెరిచి దిగువకు నీళ్ళు వదిలారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, రైతుల ప్రయోజనాల కోసమే ఈవిదంగా చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొంది. కానీ పోలింగ్ సమయంలో తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రగిలించేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ నాటకం ఆడించారని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
సెంటిమెంట్ పండించడం కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడేలా చేయడం చాలా దారుణమైన ఆలోచన. ఇది ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తుందో రెండు ప్రభుత్వాలకు తెలియదనుకోలేము. చివరికి అదే జరిగింది. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను సాగర్ డ్యామ్ వద్దకు పంపిచింది.
వారు నిన్న అర్దరాత్రి ఆంధ్రా పరిధిలో ఉన్న 13వ గేటు వద్దకు చేరుకొనేందుకు ప్రయత్నించడంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మద్య ఘర్షణ జరిగింది. ఇరు రాష్ట్రాల పోలీసులు డ్యామ్పై ఎదురెదురుగా నిలవడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్నంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రభుత్వం 1,300 మంది పోలీసులను డ్యామ్పై మోహరించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
సున్నితమైన ఇటువంటి సమస్యలపై ఎంతో విజ్ఞతతో వ్యవహరించాల్సిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈవిదంగా నీటి కోసం కీచులాడుకోవడం లేదా అలా నటిస్తూ సాగర్ డ్యామ్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడం చాలా దారుణం.
ఒకవేళ నిజంగానే నీటి కోసమే ఈ గొడవ అనుకొంటే, బిఆర్ఎస్, వైసీపిల మద్య బలమైన అనుబంధమే ఉంది కనుక ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. కానీ వాటి మద్య బలమైన అనుబంధం ఉంది కనుకనే ఈ సమస్యను అవి తమ రాజకీయలబ్ధి కోసం ఉపయోగించుకొంటున్నట్లు భావించవచ్చు.
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కనుక సాగర్ డ్యామ్ మీద మరొకటి రెండు రోజులు ఈ డ్రామా కొనసాగించిన తర్వాత ఇరు రాష్ట్రాలు వెనక్కు తగ్గవచ్చు. ఒకవేళ తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఏపీలో ఆంధ్రా సెంటిమెంట్ రగిలించి వైసీపికి తోడ్పడేందుకు ఈ డ్రామాని కొనసాగించినా ఆశ్చర్యం లేదు.
Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs in the 52nd match of IPL 2026.…
Suriya’s long-delayed film Karuppu, directed by RJ Balaji, has finally locked its theatrical release date.…