
‘వచ్చే ఎన్నికలలో తప్పకుండా మేమే గెలుస్తాం’ అని చెప్పడం చాలా సులువు. కానీ ‘ఎలా ఎందువల్ల గెలుస్తామో’ చెప్పడం చాలా కష్టం.
కనుక అధికార ప్రతిపక్షాలు సులువైన మార్గాన్నే ఎంచుకుని అదే పాట పాడుతుంటాయి. నిజానికి వచ్చే ఎన్నికలు మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. డీలిమిటేషన్, 2. సర్. 4. జమిలి ఎన్నికలు, 5. జనాభా లెక్కలు-కుల గణన, 6. .రాజకీయ సమీకరణాలలో మార్పులు, చేర్పులు, 7. ఏపీకి అమరావతి 8. తెలంగాణ కవిత కొత్త పార్టీ వగైరా వంటివి కనిపిస్తున్నాయి.
“నాడు టీడీపి ఓడిపోలేదా మేము గెలవలేదా? అలాగే మళ్ళీను,” అని పేర్ని నాని లాజిక్ మాట్లాడారు. నిజమే ఎన్నికలలో గెలుపోటములు ఎవరూ ఊహించలేరు.
కానీ కూటమి ప్రభుత్వం చేతికి బ్రహ్మాస్త్రం వంటి ‘డీలిమిటేషన్’ అందబోతోంది. దీంతో వైసీపీకి బలమున్న నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలను చీల్చి పక్క నియోజకవర్గంలో కలపవచ్చు లేదా రెండు భాగాలుగా మార్చి ఓటు బ్యాంకు నిలువునా చీలిపోయేలా చేయగలదు.
కనుక డీలిమిటేషన్ ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్య ఒకేసారి 50 శాతం పెరుగుతోందనే సంతోషం కంటే, పట్టున్న నియోజకవర్గాలు నిలువునా చీలి చేజారిపోతే ఎలా? అనే ఆందోళన ఎక్కువవుతుంది.
ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ‘సర్’ పద్దతిలో ఓటర్ల జాబితాల సవరణలు జరుగుతున్నాయి. ఈ పేరుతో వైసీపీ ఓట్లు గల్లంతు అవుతాయని వైసీపీ ఆందోళన చెందుతోంది. కనుక సీనియర్లను సజ్జల అప్రమత్తం చేశారు.
ఈసారి డీలిమిటేషన్తో ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో 119 నుంచి 179కి, లోక్సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి.
ఒకేసారి ఇన్ని సీట్లు పెరిగి, డీలిమిటేషన్లో నియోజకవర్గాలు చీలినప్పుడు జమిలి ఎన్నికలు (పంచాయితీ, మున్సిపల్, శాసనసభ, లోక్సభ వరకు) నిర్వహిస్తే అధికార పార్టీలే మేనేజ్ చేసుకోవడానికి చాలా శ్రమించాలి. ఇక ప్రతిపక్షాలు తప్పటడుగులు వేసే అవకాశాలే ఎక్కువ.
జనాభా లెక్కలలో కుల గణన చేస్తే, కులాలవారీ లెక్కలు అధికార పార్టీల చేతిలో ఉంటాయి. వాటి ప్రకారం అవి పక్కగా వ్యూహాలు రచించుకొని ప్రత్యర్ధులను చావు దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.
వీటన్నిటికీ తోడు ఏపీలో అమరావతి వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చవచ్చు. తెలంగాణలో కవిత బీఆర్ఎస్ పార్టీని, దాని ఓట్లు బ్యాంకుని చీల్చేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కలలు పగటి కలలుగా మిగిలిపోవచ్చు.
కనుక ‘వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తాం’ అని గుడ్డిగా వెళ్ళి గోతిలో పడే బదులు అధికార, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఈ మార్పులు, చేర్పులకు తగిన ఆలోచనలు, వ్యూహాలు, ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.
Veteran Telugu actress Pavala Shyamala is reportedly in critical condition following a medical emergency on…
There was once a time when Twitter was a primary medium to gauge the public…