ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మీద ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలను ఉదృతం చేస్తున్నాయి. ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా దీక్షకు దిగుతున్నారు. పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల పద్నాలుగున విజయవాడలో ఈ దీక్ష చేపడతారు.
ఇసుక కొరతపై ఆయన దీక్ష చేపట్టి,ఉదయం నుంచి రాత్రి వరకు జరపుతారని సమాచారం. అయితే దీనిని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. “చంద్రబాబు బుర్రపాడైపోయింది…బాలల దినోత్సవం రోజు దీక్ష చేయడం ఏమిటి?,” అంటూ బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు.
అసలు ఆ లాజిక్ ఏంటో అర్ధం కావడం లేదు? బాలల దినోత్సవం రోజున దీక్ష ఎందుకు చెయ్యకూడదు? ఇటువంటి ఎవరికీ అర్ధం కానీ లాజిక్స్ చెప్పడంలో సత్తిబాబు దిట్ట. పార్టనర్ షిప్ సదస్సు జరుగుతుండగా విశాఖపట్నంలోనే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపితే తప్పు లేదు గానీ బాలల దినోత్సవం రోజున దీక్ష చెయ్యకూడదా?
ఇసుక కొరత ప్రస్తుత ప్రభుత్వం వల్ల కాదని గత ప్రభుత్వ నిర్వాకం వల్లే అని సత్తిబాబు చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్న మీడియా వారు కూడా ఎలా అని అడిగారు. దాంట్లో కూడా మనం లాజిక్ చూడకూడదు. సత్తిబాబు గారి ఫ్లోలో మనం కూడా ఫాలో అయిపోవడమే.





