ఇప్పటివరకు నానుస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది. రెండు, మూడు రోజుల క్రితం కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యల వేడి చల్లారక ముందే, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి జయంత్ సిన్హా కూడా అదే పార్లమెంట్ వేదికగా ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసారు.
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం ఇచ్చిన ఆర్ధిక మంత్రి జయంత్ సిన్హా… “విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, రెవిన్యూ లోటు భర్తీ అంశాలు లేవని, ప్రస్తుతం విభజన బిల్లులో నిబంధనలను మార్చలేమని, నీతి అయోగ్ సూచనల మేరకు ఏపీకి నిధులు కేటాయిస్తున్నామని, 14వ ఆర్ధిక సంఘం నిబంధనల మేరకు నిధులు ఇస్తున్నట్లుగా” లిఖిత పూర్వకమైన జవాబు ఇవ్వడంతో… ఇక స్పెషల్ స్టేటస్ పై ఏపీ సర్కార్ అమీతుమీ తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
అంతేకాదు, గత రెండేళ్ళల్లో చేసిన దాదాపు 13 వేల కోట్లే చాలా ఎక్కువ చేసామన్నట్లుగా ఆర్ధిక మంత్రి గారి వివరణ ఉండడం విస్తుగొలిపే అంశం. దీంతో కేంద్రం ప్రత్యేక హోదా మాటను పక్కన పెడితే, కనీసం భారీ మొత్తంలో ఆర్ధిక ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా సిద్ధం లేదన్న విషయం స్పష్టమవుతోంది. 2014-15 ఆర్ధిక సంవత్సరపు ఏపీ రెవిన్యూ లోటు అయిన 14 వేల కోట్ల కంటే… రెండు సంవత్సరాలుగా దఫాల వారీగా కేంద్రం కేటాయించిన 13 వేల కోట్లు మొత్తం తక్కువ కావడం గమనించదగ్గ విషయం. కేంద్రం తీరుకు అద్దం పట్టే ఈ పోకడ ఏపీలో ఎలాంటి రాజకీయ దుమారాన్ని లేపనుందో చూడాలి.



