
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా రెండు రాష్ట్రాలకు కేటాయించబడ్డారు. కానీ వారిలో డజను మందికి పైగా ట్రిబ్యూనల్ని ఆశ్రయించి తెలంగాణలోనే ఉండిపోయారు. ఆంధ్రాకు కేటాయించబడిన వారిలో కొందరు అధికారులు తెలంగాణ వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం(డివోపిటి) తెలంగాణలో చేస్తున్న ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని, అదేవిదంగా ఏపీలోని ముగ్గురుని తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెల 16లోగా రిపోర్ట్ చేయాలని డివోపిటి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రాలో పనిచేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? తెలంగాణలో చేసేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అనే సందేహం కలగడం సహజం.
సమైక్య రాష్ట్రంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అన్ని విదాల అభివృద్ధి చెందిన హైదరాబాద్లో కుటుంబాలతో స్థిరపడ్డారు. కనుక వారు తెలంగాణలో ఉండేందుకే మొగ్గు చూపారు.
వారిలో మంచి సమర్ధులు, ప్రతిభావంతులకు కేసీఆర్ ఎంపిక చేసుకొని కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో ట్రిబ్యూనల్లో కేసులు వేసి ఇంత కాలం అక్కడే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి కూడా వారందరికీ సముచిత పదవులు, ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక అక్కడే ఉండిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర పని ఒత్తిడి, భారం ఉండేది. వారి అయిష్టతకి ఇదీ ఓ కారణమని భావించవచ్చు.
ఆ తర్వాత జగన్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల హోదాకి, గౌరవానికి తరచూ భంగం కలుగుతుండేది. సీనియర్ ఐపీఎస్ అధిరి ఏబీ వేంకటేశ్వర రావు ఇందుకు ఒక నిదర్శనం.
అదే సమయంలో మరికొందరు తెలివిగా వ్యవహరించి జగన్ ప్రాపకంతో ఓ వెలుగు వెలిగారు కూడా. ధనుంజయరెడ్డి వంటివారు ఇందుకు నిదర్శనం.
జగన్ తప్పుడు నిర్ణయాలను కాదనలేక అమలుచేసినందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో మొట్టికాయలు పడుతూనే ఉండేవి.
చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాగానే జగన్ హయాంలో రెచ్చిపోయిన సుమారు 10-15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడమో, లేదా అప్రధాన్య పోస్టులు కేటాయించడమో జరిగింది.
కనుక ఏపీలో నెలకొన్న ఈ అవాంఛనీయ రాజకీయ వాతావరణం కూడా అధికారులను తెలంగాణవైపు మొగ్గు చూపేలా చేస్తోందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ, విజయవాడ మెట్రో ఏర్పాటులో వివిధ కారణాలతో…
The Telugu state politics are far superior when compared to other neighbouring states. This…