రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా శ్రీకళారెడ్డి ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి సూచనతో శ్రీకళారెడ్డిని రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎంపిక చేసినట్లు తెలిసింది.
కోదాడ మాజీ ఎమ్మెల్యే జితేందర్రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి కి ఇటీవలే టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు మద్దతు కూడా ఉపయోగపడిందట. ఆమె పేరును త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో దిగనున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటికే ఆయన బీ-ఫారం కూడా అందుకున్నారు. ఈ ప్రకటనతో మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెటు ఇచ్చినట్టు అయ్యింది.
ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి 1555 ఓట్లు రాగా.. నోటాకు పడిన ఓట్లు 1621 . గతంతో పోల్చితే.. పరిస్థితుల్లో మార్పు వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలంగాణ ప్రజలు గుర్తించారని దీనితో తమ అవకాశాలు మెరుగయ్యాయని వారి అభిప్రాయం.





