హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 22 రౌండ్లకు గానూ ఇప్పటికి 17 రౌండ్లు పూర్తి అయ్యాయి. తెరాస అభ్యర్థి సైది రెడ్డి 34,506 ఓట్ల భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదురుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ పార్టీకి కనీసం 3000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ధరావత్తు పోతుంది అనేది ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. నిజానికి టీడీపీ ఈ ఎన్నికలలో పోటీ పెట్టడం సాహసమే. 2014లో టీడీపీ ఇక్కడ నాలుగవ స్థానములో ఉంది. అప్పటి ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉండటం విశేషం. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ కు ఈ సీటు ని వదిలిపెట్టింది. దీనితో ఈ ఎన్నిక టీడీపీకి అంత తేలిక కాదని ముందే తేలిపోయింది.
ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా టీడీపీ చేసింది ఏమీ లేదు. ప్రచారానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. బాలయ్య ప్రచారం చేస్తారని చెప్పినా జరగలేదు. దీనితో పార్టీ ఓటర్లు కూడా తమ దారి తాము చూసుకున్నారు. టీడీపీకి తెలంగాణాలో నూకలు చెల్లిపోయాయి అని ఈ ఫలితాలు చెబుతున్నాయి.
కొంతలో కొంత బీజేపీకి కూడా టీడీపీ లానే ఓట్లు పడటం ఊరటనిచ్చే అంశం. కేవలం తాము ఇక కాంగ్రెస్ తో సంబంధం లేదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఎన్నికలు చంద్రబాబుకు ఉపయోగపడ్డాయి. బహుశా ఇక చంద్రబాబు తెలంగాణపై ఆశలు వదులుకుని ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెడితే మేలని విమర్శకులు అంటున్నారు.





