కాంగ్రెస్ తో చెప్పకనే చెప్పి తెగతెంపులు చేసుకున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ హుజుర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి సిద్ధం అయ్యింది. సీనియర్ నేత చావా కిరణ్మయిని అభ్యర్థి గా పెట్టి ప్రచారం కూడా మొదలు పెట్టింది. వామపక్షాల ఉనికి ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో అక్కడ వారి మద్దతు కూడా కీలకం కాబోతుంది.
సిపిఐ ఇప్పటికే పోటీ నుండి తప్పుకుని అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించింది. ఇది ఇలా ఉండగా మరో వామపక్ష పార్టీ, సీపీఎం తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ కావడంతో బరిలో లేదు. సీపీఎం మద్దతును టీడీపీ కోరింది. మద్దతు వ్యవహారంపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్లో మాట్లాడారు.
పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని తెలిపారు. బీజేపీకి వామపక్షాలు ఎప్పుడూ దూరమై ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్, తెరాసలకు కూడా దూరంగా ఉంటేనే మేలు అని సిపిఎంలో ఒక వర్గం అంటుందట. ఈ క్రమంలో ఒకవేళ సిపిఎం టీడీపీకి మద్దతు ఇస్తే మాత్రం అది విశేషమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా అది కొత్త పరిణామానికి దారి తీయవచ్చు.
వామపక్షాలు ఏపీలో గత ఎన్నికలలో జనసేనతో కలిసి పని చేసాయి. ఎన్నికల ఫలితాన్ని బట్టి పొత్తు ఏ మాత్రం పని చెయ్యలేదని అర్ధం అవుతుంది. ఈ క్రమంలో టీడీపీతో కలిసి సిపిఎం పని చేస్తుందా? దానికి హుజుర్ నగర్ ఉపఎన్నిక తొలి అడుగు కానుందా అనేది చూడాలి. టీడీపీ వామపక్షాలు కలిసి పని చెయ్యడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్ కాలం నుండి అనేక సార్లు కలిసి పని చేశారు.





