
ప్రధాని మోడీ చమురు సంక్షోభం ముంచుకొస్తోంది కనుక పెట్రోల్, డీజిల్ వాడకం, బంగారం కొనుగోలు తగ్గించుకోమని సూచించారు. తద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని చెప్పారు. కానీ ఆయన చెప్పని మిగిలిన విషయాన్నీ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చెప్పేశారు.
త్వరలోనే దేశంలో పెను ఆర్ధిక సంక్షోభం ఏర్పడబోతోందని, దాని ప్రభావం యువత, చిరు వ్యాపారులపై తీవ్రంగా పడబోతోందని హెచ్చరించారు. ప్రధాని మోడీ అంబానీ, ఆదానీలను మరింత సంపన్నులను చేస్తూ దేశ ప్రజలను దారిద్ర్యంలో కూరుకుపోయేలా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలను పొదుపు పాటించమని చెప్పి అయన విదేశీయాత్రలకు వెళ్ళిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కానీ ప్రధాని మోడీ విహార యాత్రలకు వెళ్ళలేదని రాహుల్ గాంధీకి కూడా తెలుసు. ఒక్కో దేశ పర్యటనతో భారత్కు వివిధ రంగాలలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
ప్రధాని మోడీ సుమారు నెలన్నర క్రితం దేశంలో మళ్ళీ కరోనా-లాక్ డవున్ నాటి పరిస్థితులు వస్తాయేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. అంటే అప్పటికే పరిస్థితి బాగోలేదని చూచాయగా చెప్పారనుకోవచ్చు.
కానీ చావు కబురు చల్లగా చెప్పాలనట్లు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు సంక్షోభం.. పొదుపు అంటూ దేశ ప్రజలకు చెప్పాల్సిన విషయం కాస్త సున్నితంగా చెప్పారనుకోవచ్చు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతే ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుంది. అప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీదే పడుతుందని మూతపడుతున్న హోటల్స్, మిఠాయి దుకాణాలు, బేకరీలు చూస్తుంటే అర్ధమవుతుంది. చివరికి రోడ్డు పక్కన టిఫిన్ కోట్లు, పానీపూరీ, చాట్, నూడుల్స్ అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా ఈ గ్యాస్ భారం భరించలేక వ్యాపారాలు మూసుకుంటున్నారు.
గ్యాస్ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైంది. కనుక అది నేరుగా ప్రజా రవాణా, సరుకు రవాణాపై పడుతుంది. ఆ భారం ప్రజలకి బదిలీ చేయక తప్పదు. కానీ జీవన వ్యయం పెరిగిపోతున్న ఆదాయం మాత్రం అదే నిష్పత్తిలో ఎన్నడూ పెరగదు కనుక రాహుల్ గాంధీ చెప్పిన ఆర్ధిక సంక్షోభం చాప కింద నీరులా వ్యాపిస్తుంది.
ఓ పక్క వ్యాపారాలు మూతపడుతుంటే, మరో పక్క ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో ఐటి కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుంటే అది ఎటువంటి దుష్ప్రరిణామాలకు దారి తీస్తాయో వేరే చెప్పక్కరలేదు.
కనుక ప్రధాని మోడీ చెప్పిన్నట్లు దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడం అలవరచుకొని, రాహుల్ గాంధీ చెప్పిన ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉండాల్సిందే. ఆలోగా పరిస్థితులు చక్కబడాలని ఆ దేవుడిని కాదు కాదు… ఆ ట్రంప్ని వేడుకోవాలి.
Raw King Manchu Manoj making waves after his comeback with every character and story he…
Global aviation disruptions are increasingly affecting passengers travelling between the United States and India. Delays,…