
నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం జరుగబోతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం తరపున సిఎస్ జవహర్ రెడ్డి, వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.
సిఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన వలన ఏపీ చాలా నష్టపోయిందని, కనుక ఏపీకి సంబందించి పలు హామీలను వారికి గుర్తు చేసి వాటిని సాధించుకు రావాలని జగన్ సూచించారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎంతగా నష్టపోయిందో రాష్ట్రాన్ని పాలిస్తున్న వైసీపి ప్రభుత్వానికి తెలియదనుకోలేము.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమరావతి నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, పోలవరం ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు, నిధులు సాధించుకొని పనులు జరిగేలా చేశారు.
అలాగే తెలంగాణతో కృష్ణాగోదావరి నదీ జలాలలో ఏపీ వాటాని, తెలంగాణలో ఏపీ ఆస్తులలో వాటాలని సాధించేందుకు కూడా గట్టిగా ప్రయత్నించారు. అందుకే ఆయనపై తెలంగాణ సిఎం కేసీఆర్కు ఆగ్రహం కలిగింది. చివరికి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి పదవిలో నుంచి దించేశారు కూడా.
ఆ తర్వాత ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, కేవలం ప్రజలకు, ప్రతిపక్షాలకు చెప్పుకొనేందుకు మాత్రమే విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై నామమాత్రంగా ఒత్తిడి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. నదీ జలాల వాటాల విషయంలో కూడా ఆంధ్ర ప్రజలకు, రైతులకు, ప్రతిపక్షాలకు చెప్పుకొనేందుకు మాత్రమే తూతూ మంత్రంగా కేసులు నడిపిస్తున్నారు.
ఎగువన తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టుకొని కృష్ణాగోదావరి జలాలను తెలంగాణ జిల్లాలకు తరలించుకుపోతున్నా ఏపీ సిఎం జగన్ గట్టిగా అభ్యంతరం చెప్పలేదు. పైగా ఆయనే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు!
కేంద్ర ప్రభుత్వం కూడా ‘తాంబూలాలు ఇచ్చేశాము తన్నుకు చావండి’ అన్నట్లు ‘విభజన చేసేశాము మీ తిప్పలు మీరు పడండి’ అన్నట్లు వ్యవహరిస్తుంటే వైసీపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
కనుక ఏపీ వెనకబాటుకి కేంద్ర ప్రభుత్వాన్నో లేదా పొరుగు రాష్ట్రాన్నో నిందించడం కంటే ముందు మనల్ని మనమే నిందించుకోవలసి ఉంటుంది.
ఏపీలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళవుతోంది. కానీ ఇన్నేళ్ళలో ఏపీ అభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇస్తూ, అదే అభివృద్ధి అని చెప్పుకొంటోంది.
ఏపీ నుంచి టిడిపిని తుడిచిపెట్టేసేందుకు, వైసీపి రంగులు వేసుకొనేందుకు, మూడు రాజధానుల పేరుతో రాజకీయాలు చేస్తూ వైసీపి కాలక్షేపం చేసేసింది.
కనీసం వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులపై చూపుతున్నపాటి శ్రద్ద చూపించినా నేడు ఏపీ ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేది. ఏపీకి అన్యాయం జరిగిందని నేడు వాపోవలసిన అవసరం ఉండేదే కాదు కదా?
చేసే ఏ పనిలోనూ చిత్తశుద్ధిలేనప్పుడు ఫలితాలు ఆశించడం అవివేకమే. ఈ హడావుడి కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు చూపుకొనేందుకే అని అనుకోక తప్పదు.
Prabhas and Salman Khan happened to be two of the biggest superstars in Indian cinema.…
There is no shortage of twists and unexpected returns in Andhra Pradesh and Telangana politics.…