
తల్లిని చెల్లిని దూరం చేసుకొని జగన్ తప్పు చేశారా? అంటే అవుననే ఇప్పుడు అనిపిస్తుంది. ఒకప్పుడు తనకి, తన పార్టీకి కొండంత అండగా ఉన్న వారిద్దరే ఇప్పుడు జగన్కి శత్రువులుగా మారారు!
వారితో ఆస్తుల కోసం చేస్తున్న ఈ యుద్ధం వలన తన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని, అదే సమయంలో వారిరువురి పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుందని అపర చాణక్యుడి శిష్యుడైన జగన్కు తెలియదనుకోలేము. తెలిసీ తన పార్టీ నేతలందరినీ వారిపై ఉసిగొల్పుతున్నారంటే రాజకీయంగా మరో తప్పటడుగు వేస్తున్నట్లే.
అయితే తప్పు కాదని నిరూపించేందుకు అలవాటు ప్రకారం షర్మిల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపణలు చేయిస్తున్నారు. తద్వారా బాధితులు తల్లీచెల్లీ కాదు తానే బాధితుడినని నిరూపించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
కానీ ఏమాట కామాట చెప్పుకుంటే, తల్లీ చెల్లిని బయటకు గెంటేసి జగన్ అప్పుడే పెద్ద తప్పు చేశారు. ఒకవేళ వారిని పక్కన ఉంచుకొని ఉండి ఉంటే, చంద్రబాబు నాయుడులా జగన్కి కూడా ఓ బలమైన కుటుంబం, క్రీస్టియన్ల అందండలు ఉండేవి. అప్పుడు ఏపీలో రాజకీయాలు మరోవిదంగా ఉండేవి.
కానీ జగన్ తల్లిని చెల్లిని ఎందుకు గెంటేశారు? అంటే ఈ ప్రశ్నకు షర్మిల భర్త అనిల్ కుమార్ సమాధానం చెప్పారు.
ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “షర్మిలకి తన అన్న అంటే మహా పిచ్చి. అన్న కోసం దేనికైనా సిద్దం అన్నట్లు ఉండేది. కనుక ఆమె ఏనాడూ అన్నని ఆస్తులలో వాటా ఇవ్వాలని కానీ, పదవులు ఇవ్వాలని గానీ అడిగింది లేదు. ఈ మాట నేను బైబిల్ మీద ఒట్టేసి చెపుతున్నాను. అటువంటి ఆమె ఇప్పుడు ఆస్తుల కోసం అన్నతో గొడవపడుతుందని అనుకోగలమా? ఆస్తులే కావాలనుకుంటే ఆనాడే అడిగి ఉండేది కదా? కానీ ఒక్క మాట మాట్లాడకుండా తెలంగాణకు వెళ్ళిపోయింది కదా?” అని ప్రశ్నించారు.
ఆనాడు ఆమె పాదయాత్ర చేస్తుంటే సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్ వద్దకు వెళ్ళి నీ పార్టీని షర్మిల ఎత్తుకుపోయింది. ఇంకా నీకు దక్కదని చెప్పారు. అప్పుడు భారతి నేరుగా షర్మిలని అదే మాట అడిగేశారు. అప్పటి నుంచే వారిలో తీవ్ర అభద్రతాభావం మొదలైంది….వారిరువురి తీరు పూర్తిగా మారిపోయింది. సజ్జల వంటివారు చాలా మంది వారి చుట్టూ చేరి అన్నా చెల్లెళ్ళ మద్య దూరం పెంచేసి చివరికి విడగొట్టేశారు,” అని అనిల్ కుమార్ చెప్పారు.
ఆయన ఇదో కొత్త విషయం చెప్పారనుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా మరోవిషయం కూడా చెప్పుకోవలసి ఉంటుంది. జగన్లో పూర్తి భిన్నమైన రెండు లక్షణాలున్నాయి.
ఒకటి తన బుర్రకి ఏది తోస్తే అదే జరగాలనుకునే నిరంకుశవాది. అందువల్లే ఆయన అన్ని తప్పటడుగులు వేస్తున్నా నేటికీ ఎవరూ హితవు చెప్పలేకపోతున్నారు.
రెండోది తీవ్ర అభద్రతాభావం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా తనను చంపేస్తారేమోననే భయంతో దారి పొడవునా పరదాలు కట్టించుకోవడం, పచ్చటి చెట్లు నరికించేయడం, తన ప్యాలస్ చుట్టూ పెద్ద ఇనుప కంచె వేసుకొని 900 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకోవడం, టిడిపితో జనసేన, బీజేపీలు కలిస్తే తీవ్ర ఆందోళన చెందడం వంటివి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.
మరోవిదంగా చెప్పాలంటే జగన్లో ఓ అపరిచితుడు ఉన్నాడు. ఆ అపరిచితుడే తల్లి, చెల్లిని చూసి అభద్రతాభావంతో భయపడి బయకు గెంటేసి ఉండవచ్చునని అనిల్ కుమార్ మాటలతో అర్దమవుతోంది. కానీ రాజకీయాలు, ఆస్తులు కూడా కారణమే అని జగన్, షర్మిల కలిసి నిరూపిస్తున్నారిప్పుడు.
Adivi Sesh has hit another home run as his latest thriller, Dacoit, has claimed the…
బిజేపికి బ్రహ్మచర్యం బాగా అచ్చొచ్చినట్లుంది. ప్రధాని మోడీ, యూపీ సిఎం యోగీ ఆదిత్య నాథ్ తర్వాత పశ్చిమ బెంగాల్లో మరో…