
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన బిఆర్ఎస్ పార్టీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, కాంగ్రెస్ మిత్రపక్షాల ‘ఇండియా’ కూటమిలో గానీ లేదన్నారు. అయితే తాము ఒంటరిగా లేమని తమకు చాలా మంది మిత్రులున్నారని కేసీఆర్ చెప్పుకొన్నారు.
దేశంలో ప్రాంతీయపార్టీలలో చాలా వరకు ఈ రెండు కూటములలోనే ఉన్నాయి. వైసీపీ, టిడిపి, బిజెడీ వంటి కొన్ని పార్టీలు మాత్రమే ఏ కూటమిలోను లేవు. అయితే అవన్నీ పరోక్షంగా మోడీకే మద్దతు తెలుపుతున్నాయి. కనుక వాటిలో ఏ ఒక్కటీ కేసీఆర్తో చేతులు కలిపేందుకు సిద్దంగా లేదని అర్దమవుతోంది.
కానీ కేసీఆర్ తాను ‘ఒంటరిగా లేనని మిత్రులు ఉన్నారని’ అంటున్నారు. మరి ఆయన రహస్య మిత్రులు ఎవరు? అనే సందేహం కలుగుతుంది.
ఎన్డీయే కూటమిలో పార్టీలు ఏవీ కూడా కేసీఆర్తో చేతులు కలిపే అవకాశం లేదు.
ఇదివరకు ఆయన ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాల అధినేతలను, ముఖ్యమంత్రులనే కలిసారు. వారే ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ‘ఇండియా కూటమి’ ఏర్పాటు చేసుకొన్నారు. కనుక వారే మళ్ళీ తన వద్దకు రావచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు.
కేసీఆర్ అలా భావించడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. దేశంలో ఎప్పుడు ప్రతిపక్ష కూటమి ఏర్పడినా అది విఫలమవడానికి కారణం దానికి ఎవరు నాయకత్వం వహించాలి?ఎవరు ప్రధాని అభ్యర్ధిగా ఉండాలని తేల్చుకోలేకపోవడమే. ఇప్పుడూ ఇండియా కూటమిలో నితీశ్ కుమార్, మమతా బెనర్జీ ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంలో వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతే వారి కూటమి విచ్ఛిన్నం అయ్యే అవకాశాలే ఎక్కువ. కనుక వారిలోనే కొందరు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తనతో చేతులు కలపవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు.
కానీ అందుకోసం కేసీఆర్ ముందుగా తన ఎంపీల సంఖ్య పెంచుకోవలసి ఉంటుంది. రాబోయే లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్రలో కొన్ని సీట్లు గెలుచుకోగలిగితే, తెలంగాణలోని ఎంపీలతో కలిపి బిఆర్ఎస్ బలం పెరుగుతుంది. అప్పుడే ఇండియా కూటమిలో అన్నీ కాకపోయినా కొన్ని పార్టీలు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించవచ్చు. బహుశః ఇదే ఆలోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లున్నారు.
ఒకవేళ లోక్సభ ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో, అలాగే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసి, తాను మహారాష్ట్ర, ఇంకా బిఆర్ఎస్ విస్తరించడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించవచ్చు.
Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs in the 52nd match of IPL 2026.…
Suriya’s long-delayed film Karuppu, directed by RJ Balaji, has finally locked its theatrical release date.…