
జనసేన, వైసీపిల మద్య చాలా కాలం ఊగిసలాడిన ముద్రగడ పద్మనాభం చివరికి వైసీపిలో చేరిపోయారు. కనుక జగన్ మనసులో మాటలను, ఆలోచనలను, వైసీపి భాషలో ప్రజలకు వివరిస్తున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో ముఖ్యమంత్రి పదవికి జగన్ తప్ప మరొకరు కనుచూపు మేర ఎవరూ కనిపించడం లేదు. జగన్ మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి కావడమే కాదు మరో 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తారు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో పేదల కడుపు నింపుతున్నారు. ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది కనుక.
ఇంతకాలం జగన్ నన్ను ఆహ్వానించలేదు కనుక వైసీపిలో చేరలేదు. ఇప్పుడు ఆహ్వానించారు కనుక చేరాను. పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చేందుకు లేదా కాపు ఓట్ల కోసమో జగన్ నన్ను వైసీపిలో తీసుకున్నారనే వాదన సరికాదు.
అయినా నేను ఎన్నడూ పవన్ కళ్యాణ్ని కలవలేదు. కనీసం చూడలేదు. ఆయనతో నాకెందుకు గొడవ? అలాగే ఆయన నా జోలికి వస్తారని అనుకోను. వస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
ఆయన చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. కనుక టిడిపి, జనసేన రెండు పార్టీలు ఓడిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటిని ఎన్నికలలో ఓడించేందుకు నేను కూడా గట్టిగా ప్రయత్నిస్తాను,” అని ముద్రగడ పద్మనాభం అన్నారు.
కేవలం ఐదేళ్ళ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా విధ్వంసం అయ్యిందో ముద్రగడ పద్మనాభంకు తెలియనిది కాదు. కొండల్లా పేరుకుపోయిన అప్పులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోగా వారు దాచుకొన్న జీపీఎఫ్ సొమ్ముని, పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం వాడేసుకొంటోందని ముద్రగడకు తెలియదనుకోలేము.
ఐదేళ్ళ పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు పెట్టడం, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మిగల్చడం, రాజధాని రైతుల ఉసురు పోసుకోవడం వంటి జగన్ ప్రభుత్వ భాగోతాలన్నిటినీ ముద్రగడ పద్మనాభం ఏవిదంగా విస్మరించారో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ పాలనలో సుబిక్షంగా ఉందని, మరో 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకొంటున్నారు.
ఇదివరకు ఆయన ‘నా కాపు జాతి’ అంటూ చాలా ఆవేశపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే కాపు జాతిని నిలువునా చీల్చడానికి సిద్దపడ్డారు. దేనికి?ఏం ప్రయోజనం ఆశించి జగన్కు వత్తాసు పలుకుతున్నారు?
కాపుజాతి పట్ల ఆయనకు నిబద్దత లేకపోతే పాయే… కనీసం ఆంధ్రప్రదేశ్ పట్ల అయినా ఉండాలి కదా?కానీ కాపుజాతి కంటే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ముద్రగడ పద్మనాభంకు తన రాజకీయ జీవితం, పదవులే ముఖ్యమని భావిస్తున్నారా?ఆయనే చెప్పాలి.
అయినా ఐదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మరో 30 ఏళ్ళు జగన్ పాలించాలనుకున్నా ఇంకా రాష్ట్రంలో ఏమి మిగిలి ఉంటుంది?
Actress Ameesha Patel recently bashed other actresses for using aggressive PR to look like top…
BOTTOM LINE Violence High, Substance Low RATING 1.75/5 Director: Ravi Babu Story, Screenplay: Ravi Babu,…