ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ కాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవలేకపోయింది. ఇప్ఫడు కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా నియమించుకోలేని స్థితికి వచ్చేసింది.
2019 ఎన్నికలు పూర్తి అవ్వగానే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఫలితాలు రాకముందే ఓటమికి బాధ్యత తీసుకున్నారు. దానిని ఆమోదించడానికి కూడా కాంగ్రెస్ సాహసం చెయ్యలేకపోతుంది. ఈలోగానే కొత్త అధ్యక్షుడు కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఆ పార్టీకి నాయకత్వం వహించడానికి కాస్త పలుకబడి ఉన్నవారు, పరపతి ఉన్నవారు ఇష్టపడడం లేదు.
కొద్ది మంది ఉత్సాహపడుతున్నా, మిగిలినవారు ఒప్పుకోవడం లేదట. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును బాద్యతలు తీసుకోవాలని అడిగితే ఆయన నో అంటున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్లు ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యర్దిత్వాన్ని పార్టీలో ఎక్కువ శాతం మంది వ్యతిరేకిస్తున్నారట.
అలాగే మరో మహిళా నేత సుంకర పద్మశ్రీ తనకు పిసిసి పీఠం ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే ఆమె పెద్దగా ప్రజా క్షేత్రంలో ఉన్న నేత కాదు. ఆమెను నియమిస్తే మొదటికే మోసం వస్తుందని ఆలోచిస్తున్నారు. పార్టీ ఇన్ చార్జీ ఉమెన్ చాందీ అందరి అభిప్రాయాలు తీసుకుంటారట. సరైన అభ్యర్థి దొరికే వరకూ రఘువీరారెడ్డి రాజీనామాను ఆమోదించే పరిస్థితి లేదట.





