తెలంగాణలో ఒక్కసారిగా 48,660 మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడం పెను సంచలనం సృష్టిస్తుంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేసే ఆందోళనలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని పవన్ గుర్తుచేశారు. కార్మికులు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు ప్రజలలో పెద్దగా ఆదరణ లేదు. పవన్ కు నిజంగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చెయ్యాలనే కోరిక ఉంటే ఇదే సరైన తరుణం.
48,600 ఉద్యోగులు వారి కుటుంబాలను తాకే ఇటువంటి నిర్ణయం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇంత కీలకమైన విషయంపై కనీసం బయటకు కూడా రాకుండా ఏదో నమ మాత్రంగా ఒక ప్రెస్ నోట్ తో సరిపెట్టడం జనసేన రాజకీయ అలసత్వనికి నిదర్శనం అని అభిమానులే నిందిస్తున్నారు.





