
ఆంధ్రాలో పాప ప్రాయశ్చిత్తం పోటీలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎవరు చేసిన పాపాలకు వారే ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ప్రత్యర్ధిని నిందిస్తూ వారి పాపాలకు తాము ప్రాయశ్చిత్తం చేసుకోవడమే వెరైటీ.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జగన్ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్ష చేపట్టి, మొన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. దీక్ష ముగిసిన తర్వాత కాలి నడకన తిరుమల వెంకన్న స్వామివారిని దర్శించుకోబోతున్నారు.
పవన్ కళ్యాణ్ని చూసి మరికొందరు నేతలు కూడా ఎవరి శక్తిని బట్టి వారు 24గంటలు, 48 గంటలు ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఈ కల్తీ వ్యవహారాన్ని సిఎం చంద్రబాబు నాయుడే బయటపెట్టినప్పటికీ టిడిపిలో ఎవరూ ఈ పేరుతో రాజకీయాలు చేసేందుకు ఇష్టపడటం లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈ వ్యవహారం గురించి అడపాదడపా మాట్లాడుతున్నారు.
అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోవడంతో దాని నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన కూడా సిఎం చంద్రబాబు నాయుడు పాపాలు చేశారంటూ ప్రాయశ్చిత్త పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటానని చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను సమానంగా గౌరవించాలి కనుక అన్యమతస్థుడైనప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. అందుకు ఎవరూ తప్పు పట్టలేదు కూడా. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ జగన్ రాజకీయాలు చేస్తుండటమే విచిత్రం.
ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు మొదట పరస్పరం విమర్శించుకున్నప్పుడు అందరూ ఆసక్తిగా వాటిని గమనించారు. కానీ అధికారం ప్రతిపక్షాల ఈ ప్రాయశ్చిత పోటీలు, తిరుమల స్వామివారి పేరుతో చేస్తున్న రాజకీయాల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా వెనక్కి తగ్గితే మంచిది లేకుంటే ఇరు వర్గాలు ఏదో ఓరోజు ఏదో ఓ రూపంలో చాలా భారీగా మూల్యం చెల్లించవలసి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ, విజయవాడ మెట్రో ఏర్పాటులో వివిధ కారణాలతో…
The Telugu state politics are far superior when compared to other neighbouring states. This…