
తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిస్తే ఏపీలో బీసీలు వైసీపీ బుట్టలో పడిపోతారని సిఎం జగన్మోహన్ రెడ్డి ఎలా అనుకొన్నారో తెలీదు. కానీ ఇంతకు మించి వేరే బలమైన కారణం కనబడటం లేదు కనుక బహుశః ఇదే ఉద్దేశ్యంతో ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.
అయితే చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రయోగం 2014లోనే చేసి చేతులు కాల్చుకొన్నారు. అప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఆర్. కృష్ణయ్యను హడావుడిగా టిడిపిలోకి రప్పించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఓటమి తప్పలేదు. సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ప్రయోగం మరోసారి చేస్తున్నట్లున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీసీలలో అధిక శాతం టిడిపి వైపే ఉన్నారు. ఇతర పార్టీల మద్య చీలినవారు కూడా ఉన్నారు. కనుక వారందరినీ కృష్ణయ్యతో ఆకర్షించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నట్లున్నారు. మంచిదే! అందుకు పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకొనే బదులు ఏపీలో బీసీ నేతను ఎంచుకొని ఉంటే కొంతైనా ఫలితం ఉండేదేమో?
ఇక రేపటి నుంచి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే ప్రస్తావిస్తూ మళ్ళీ దెప్పి పొడవకుండా ఉంటారా?
మరో విషయం ఏమిటంటే, కృష్ణయ్య ఇల్లు అలకగానే పండగ చేసుకొంటానంటే కుదరదు. సిఎం జగన్మోహన్ రెడ్డి తనను పిలిచి మరీ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారో సదా గుర్తుంచుకొని, ఏపీలో బీసీలను వైసీపీ వైపు ఆకర్షించి తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే ఆయన చెప్పారని ఏపీలో బీసీలు గంపగుత్తగా వైసీపీవైపు వచ్చేస్తారా?అంటే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా కాదనే చెపుతారు. కానీ రాజ్యసభ సీటు ఫ్రీగా రాదు కనుక కృష్ణయ్యకు ఇటు వైసీపీతో, అటు బీసీలతో ఇక తిప్పలు తప్పకపోవచ్చు.
Vaazha II: Biopic of a Billion Bros directed by Savin SA was released in theatres…