మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించాల్సిందట కాకపోతే కుదరలేదు. ‘‘రామ్చరణ్తో ‘సైరా’లో ప్రత్యేక పాత్ర చేయిద్దామనుకున్నాం. ఇంటర్వెల్ ముందు వచ్చే షేర్ఖాన్ పాత్రను సల్మాన్ఖాన్, సంజయ్ దత్లలో ఒకరితో వేయిద్దామని మొదట చరణ్ అన్నాడు. వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ, చరణ్తోనే చేయిస్తే బాగుంటుందని మరో అభిప్రాయం యూనిట్లో వచ్చింది,” అన్నారు చిరంజీవి.
“అయితే కథలో ఆ పాత్రను నేను ఎదుర్కొంటా. పోరాట సమయంలో ఆ పాత్ర, నాతో ‘నరసింహారెడ్డీ! నీ లాంటివాడు దేశానికి కావాలి’ అంటూ నా చేతిలోని కత్తితో పొడుచుకొని, చనిపోతుంది. అయితే, నా పాత్ర చేతిలో చరణ్ పాత్ర చనిపోవడం యాంటీ సెంటిమెంట్గా, బాగుండదని అనిపించింది,” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే సినిమా నిడివి ఎక్కువ అవుతుందని ఈ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారట. గతంలో చిరంజీవి రామ్ చరణ్ మగధీర, బ్రూస్ లీ సినిమాలలో నటించారు. మరోసారి ఒకేసారి వారిద్దరినీ స్క్రీన్ మీద చూసుకునే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది.





