
Revanth Reddy and BRS Congress clash over Tukkuguda land deal
తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని అందరూ అనుకుంటే, ఈసారి బయట యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్హౌసు వద్దకు వెళ్ళి చావు డప్పు కొట్టి హెచ్చరించారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసి పిర్యాదు చేశారు. అయితే ఫామ్హౌసు పరిసర ప్రాంతాలలో దళిత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తిరిగిన రోడ్లని బీఆర్ఎస్ పార్టీ నేతలు పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది.
“దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే ఎలాగూ గౌరవం లేదు. దళిత ప్రజలన్నా బీఆర్ఎస్ పార్టీకి చాలా చులకనే,’ అంటూ కాంగ్రెస్ మంత్రులు శాసనసభలో బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టారు.
అయితే వారిని సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేయడంతో, బీఆర్ఎస్ పార్టీ మరో కొత్త వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫామ్హౌసు వద్దకు వెళ్ళి చావు డప్పు కొట్టినందుకు ప్రతిగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు నేడు నగరంలో తుక్కుగూడాకు వెళ్ళారు. అక్కడ సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించింది.
సుమారు రూ.200 కోట్లు విలువ చేసే ఖరీదైన ఈ భూమినీ కేవలం రూ.7కోట్లకే కట్టబెట్టేసిందని, పరిశ్రమల పేరుతో సిఎం రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వం భూములు కట్టబెట్టేస్తూ అధికార దుర్వినియోగానిక్ పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే రికార్డ్స్ మెయింటెయిన్ చేస్తోంది. వెంటనే బీఆర్ఎస్ హయంలో కేటీఆర్ తన బంధువులకు, దోస్తులకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏవిధంగా ఎన్ని ఎకరాలు కట్టబెట్టారో చిట్టా విడుదల చేసింది.
బీఆర్ఎస్ హయంలో భూదోపిడీ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కానీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు, బంధు మిరులకు ఈవిధంగా అక్రమంగా భూములు కట్టబెడుతోందని సోషల్ మీడియాలో ఆధారాలు లభిస్తున్నా కోర్టుని ఆశ్రయించడం లేదు. కేసులు వేయడం లేదు. అంటే అర్థం ఏమిటి?
Karthi's long pending film Sardar 2 directed by PS Mithran was finally released in theatres…
India will play 14 ODIs before IPL 2027 as the team prepares for the 2027…