కథలో కంటెంట్.. హీరోయిజంలో సత్తా ఉందని నిరూపించింది ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ..అధీర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ మధ్య ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సంజయ్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ఈ రోజు చిత్ర షూటింగ్ మొదలు పెట్టాడు. పది రోజుల పాటు హైదరాబాద్ లో ఆయన మీద సోలో, హీరో యాష్ తో కాంబినేషన్ సీన్స్ షూట్ చెయ్యబోతున్నారు.
హోమ్బేల్ ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు.
వచ్చే ఏడాది వేసవిలో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ సూపర్ స్టార్లైనా ఎన్టీఆర్ తో గానీ, మహేష్ బాబు తో గానీ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.





