
ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరు కూడా తమ సొంత కుటుంబ సభ్యుల నుండి రాజకీయ ఎదురుదెబ్బలు తిన్నవారే. ఒకరు అన్న పార్టీ విజయం కోసం పోరాడి అన్న చేతిలో అవమానించబడ్డవారైతే, మరొకరు తండ్రి పార్టీలో అన్నతో సమాన గుర్తింపు కోసం పోరాడి చివరికి అదే పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు.
అయితే ఈ ఇద్దరి రాజకీయంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేసే రాజకీయం కాలక్షేపానికి చేసే కార్యక్రమంలా, మొక్కుబడి చేసే పూజలా సాగుతుంటే కవిత చేస్తున్న రాజకీయం తన రాజకీయ భవిష్యత్ కోసం చేసే ఒక యజ్ఞంలా, గురి పెట్టిన లక్ష్యాన్ని అందుకునే ఒక ప్రయత్నం లా నిరంతరం కొనసాగుతుంది.
అలాగే రాష్ట్ర సమస్యల పై షర్మిల స్పందిస్తున్న తీరు, ప్రజలతో ఆమె మమేకమవుతున్న విధానం రెండు కూడా అటు షర్మిల రాజకీయ ఎదుగుదలకు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రగతికి కానీ ఎటువంటి చేయూతను అందించేలా కనిపించడం లేదు. షర్మిల తన రాజకీయ ఎదుగుదలను కానీ పార్టీ పెరుగుదలకు కానీ ఎటువంటి రాజకీయ వ్యూహాలు వేయలేకపోతున్నారు.
ఏపీలో 11 సీట్లతో వైసీపీ కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అంటే ఏపీలో ఒకరకంగా కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షమన్నదే లేదు. అలాగే ఉన్న ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లు కూడా అసెంబ్లీకి వెళ్లకపోవడం, రప్ప రప్ప అంటూ హింసను ప్రేరేపించడంతో ప్రజలలో ఆ పార్టీ నేతల పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది.
ఇటువంటి సమయంలో షర్మిల రాష్ట్రంలో ఉండే ప్రజా సమస్యల పైనా, ప్రభుత్వ చర్యల పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పెద్దలను నిలదీస్తూ, వైసీపీ ని ఎండగడుతూ తనతో పాటు తన పార్టీకి కూడా ప్రజామద్దతు కూడకట్టుకోవచ్చు. తిరుమల లడ్డు నుంచి కల్తీ పాల వరకు,
వైసీపీ నేతల లిక్కర్ కేసుల నుంచి బాబాయ్ వివేకా హత్య కేసు వరకు ఇలా ప్రతి విషయంలోనూ షర్మిల కు షర్మిల రాజకీయానికి ఏపీలో స్పేస్ ఉంది. అయినా షర్మిల దానిని బలంగా వినియోగించుకోలేక ఇప్పటికి తన రాజకీయంతో ప్రజలలో ఒక సరైన గుర్తింపు కానీ నమ్మకం కానీ సంపాధించుకోలేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయారు.
ఇక కవిత విషయానికొస్తే, తన పోరాట పటిమతో దశాబ్దం గా తెలంగాణ రాజకీయాలలో ఏకచక్రాధిపత్యం వహించిన కేసీఆర్ ని సైతం గద్దె దింపిన రేవంత్ ఒక పక్క, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్, హరీష్, కేటీఆర్ మరోపక్క, కేంద్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇంకో పక్క ఇలా త్రిశూల వ్యూహం మాదిరి వీరి మధ్య కవిత ఒంటరి ప్రయాణం చేస్తున్నారు.
అయినా కూడా కవిత తగ్గేదెలా అన్నట్టుగా తన రాజకీయంతో ఎల్లప్పుడూ తెలంగాణ రాజకీయాలలో నానుతున్నారు. నిత్యం ఏదొక కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతూ అక్కడి స్థానిక సమస్యల పై స్పందిస్తూ అటు అధికార కాంగ్రెస్ ని ప్రశ్నిస్తూనే ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ ను నిలదీస్తూనే మరోపక్క బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ నీటి హక్కులు అంటూ ఏపీ ప్రాజెక్టుల నిర్మాణాల పై కూటమి ప్రభుత్వం పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల పై పోరాటం అంటూ దీక్షలు చేసారు, రైలు రోకోలు నిర్వహించారు. తాజగా ఖమ్మం భూదాన్ బాధితుల తరుపున ప్రభుత్వం పై పోరాటం అంటూ అరెస్టయ్యారు.
నిరుద్యోగుల కోసం గళం విప్పుతున్నారు, గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, ప్రస్తుత ప్రభుత్వ విధానాల పై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు, బీజేపీ చేస్తున్న తెరచాటు రాజకీయం ని బహిరంగంగా ఎండగడుతున్నారు. ఇలా కవిత జాగృతి పేరు మీద చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అలాగే తండ్రి పేరు ను పక్కన పెట్టి, ఆయన ఫోటోను కాదని తన సొంత పార్టీ రాజకీయంతోనే తానూ తెలంగాణ రాజకీయాలలో ప్రజామద్దతు సాధిస్తానని, అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటానని కవిత చాల ధీమాగా ఉన్నారు. అలాగే ఆ దిశగా కూడా ఒక్కో అడుగు వేస్తున్నారు. మరి షర్మిల ఇప్పటికి వైఎస్ఆర్ నీడలోనే కొనసాగాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ జాగృతితో కవిత చేస్తుంది రాజకీయం అయితే కాంగ్రెస్ తో షర్మిల చేస్తుంది.?
The 41st match of IPL 2026 between Mumbai Indians and Sunrisers Hyderabad at Wankhede Stadium…
Prakash Raj has built an image as a fearless political voice, someone who questions power…