
ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీ బలోపేతానికి బదులు వైసీపీ బలం కోసం యత్నించిన సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవితో పాటుగా టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల నమ్మకాన్ని కోల్పోయారు. అలాగే అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న చరిత్ర కూడా సోము సొంతం.
దీనితో 2024 ఎన్నికలలో కూటమి లో భాగంగా బీజేపీ తరపున ఎన్నికలలో పోటీ చేసే అవకాశానికి దూరమయ్యారు సోము. అయితే పొత్తులో భాగంగా తాజాగా బీజేపీ పార్టీకి దక్కిన ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ అధిష్టానం సోముకు కట్టబెట్టింది. అయితే సోము వీర్రాజు గత చరిత్రను చూసిన టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన పై నమ్మకం లేదు అంటూ సోము ఎమ్మెల్సీ స్థానం పై గుర్రుగా ఉన్నమాట వాస్తవం.
ఎమ్మెల్సీ పదవితో కూటమి ప్రభుత్వంలో భాగమైన సోము వీర్రాజు తన పై ఉన్న గత చరిత్రపు వైసీపీ నీలి నీడలను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ కూటమి పార్టీలకు దగ్గరయ్యే ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ తన ‘శీల’ పరీక్షను నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు వీర్రాజు.
2014 ఎన్నికలలో 60 సీట్లతో ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నప్పటికీ వైస్ జగన్ నాడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు. అలాగే నేడు 11 సీట్లతో ప్రజలు తనకివ్వని ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం పట్టుబట్టి ఇప్పుడు అసెంబ్లీ గడప తొక్కింది లేదు.
నాడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో గళం వినిపించాల్సిన జగన్ ‘పాద’యాత్రలంటూ రోడ్ల మీద తిరిగారు, నేడు లేని హోదా సాకు చెప్పుకుని తన పార్టీ నేతల ఓదార్పు కోసం ‘జైలు’ యాత్రలు చేస్తూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు అంటూ జగన్ మీద మునుపెన్నడూ లేని విధంగా పదునైన విమర్శనాభాణాలే సంధించారు సోము.
వైసీపీ పార్టీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీ ఓటు బ్యాంకుని 20% కంటే తక్కువకి కుదించడమే మా ప్రభుత్వ కర్తవ్యమని, వైస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీ వినాశనం తప్పదంటూ వైసీపీ శ్రేణులు ఊహించని విధంగా జగన్ పై రెచ్చిపోయారు సోము వీర్రరాజు.
అయితే కూటమిలో భాగంగా తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి ప్రతిగా టీడీపీ శ్రేణులకు తన పై ఉన్న అపనమ్మకాన్ని తొలగించుకొనేందుకు, తిరిగి టీడీపీ, జనసేనలకు దగ్గరయ్యేందుకు సోము వైసీపీ పై, ఆ పార్టీ అధినేత వైస్ జగన్ పై ఈ విధమైన రాజకీయ విమర్శలు చేసి ఉండవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
సోము బాటలోనే బీజేపీలో మరికొంతమంది వైసీపీ సానుభూతిపరులు, వైసీపీ అనధికార అధికార ప్రతినిధులు కూడా కూటమి నమ్మకం కోసం ఆరాటపడుతున్నారు. మరి వారు కూడా తమ శీల పరీక్ష నిరూపించుకుని కూటమి లో పదవులు దక్కించుకుంటారా.?
The Kollywood film Mandaadi starring Soori and Suhas in lead roles and directed by Mathimaran…
Victory Venkatesh, Nandamuri Kalyanram are coming together for the first time in the direction of…